ఆంధ్రప్రదేశ్లో జగనన్న చేదోడు పథకం కింద జిల్లాలో 11,661 మంది దర్జీలను అర్హులుగా గుర్తించి రూ.11.66 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఈనెల 10న రూ.పది వేల చొప్పున సాయం మొత్తాన్ని అధికారులు జమ చేశారు. కర్లపాలెం మండలం పెదగొల్లపాలెంలో 30 మంది దర్జీలకు రూ.3 లక్షలు మంజూరు చేశారు. సాయం మంజూరులో స్థానికంగా ఓ నేత చక్రం తిప్పాడు. మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి, వాలంటీరు కలిసి అనర్హులతో తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేయించారు. పాత కుట్టు మిషన్లు కొనుగోలు చేయించడం సహా బయట నుంచి కొన్ని మిషన్లు తెప్పించి దర్జీ వృత్తిలో ఉన్నట్లుగా అధికారులకు చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చి దర్జీ వృత్తిలో లేని వారికి సాయం మంజూరు చేయించారు. లబ్ధిదారులు దర్జీ వృత్తిలో ఉన్నట్లుగా కార్మిక శాఖ అధికారితో ధ్రువపత్రాలు జారీ చేయించారు. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే అనర్హులకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ లెక్కన జిల్లాలో ఎంతమందో..?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణం నిర్వహించే దర్జీకి మాత్రమే సాయం అందాలి. పూర్తిగా దర్జీ వృత్తిపై ఆధారపడి జీవించే వారికి మాత్రమే సాయం మంజూరు చేయాలి. దుకాణం లేని వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయరాదు. ఈ నిబంధనలు తుంగలో తొక్కి అనర్హులను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేయించారు. సొమ్ము డ్రా చేసి స్వాహా చేసేలోపే జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. లబ్ధిదారులుగా ఎంపిక చేసిన వారిలో ముగ్గురికి మాత్రమే దుకాణం ఉన్నట్లుగా పరిశీలనలో తేలింది. జాబితాను అధికారులు తనిఖీ చేసి నిధుల స్వాహా చేయడానికి యత్నించిన నేత కుటుంబంలో అక్రమంగా సాయం పొందిన ఓ లబ్ధిదారురాలు, కేంద్రం నుంచి పింఛన్ తీసుకుంటున్న పింఛన్దారురాలితో పాటు మరో మహిళ నుంచి రూ.30 వేలు రికవరీ చేశారు. అక్రమాలకు సహకరించిన వాలంటీరుతో పాటు మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిపై చర్యలు తీసుకోలేదు. అక్రమాలు వెలుగులోకి రావడంతో వారు తప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్క మండలంలోనే రూ.లక్షల్లో అక్రమాలకు పాల్పడగా జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ చేతివాటం ప్రదర్శించి భారీగా ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయి.
విచారణ చేస్తున్నాం
పెదగొల్లపాలెం పంచాయతీ పరిధిలో జగనన్న చేదోడు పథకంలో దర్జీలకు మంజూరు చేసిన సాయంలో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే.. విచారణ ప్రారంభించామని ఎంపీడీవో ఉషారాణి తెలిపారు. ఇప్పటికే ముగ్గురు అనర్హులను గుర్తించి సొమ్ము రికవరీ చేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు చేపడతాం.
వాలంటీరుదే బాధ్యత
దరఖాస్తు చేసుకున్నవారు దర్జీ వృత్తిలో ఉన్నారా లేదా అన్న విషయాన్ని వాలంటీరే చూసుకోవాలి. పెదగొల్లపాలెంలో దర్జీలుగా నేను ధ్రువ ప్రతాలు ఇచ్చినవారిలో పలువురు అనర్హులు ఉన్నట్లు తెలిసింది. ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తా. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ధ్రువీకరణ పత్రాలు ఇస్తాం. - కోటేశ్వరరావు, సహాయ కార్మిక శాఖాధికారి
ఇదీ చూడండి..