గ్రేటర్లో ఇంజినీరింగ్ పనుల నాణ్యత ప్రమాణాలపై జీహెచ్ఎంసీ క్వాలిటీ కంట్రోల్ విభాగం చర్యలు చేపట్టింది. పనుల్లో నాణ్యత లోపించడం వల్ల సదరు కాంట్రాక్టర్లకు రూ.1. 55 కోట్ల జరిమానా విధించింది. ఆయా పనులను సక్రమంగా నిర్మించేలా ఆదేశించింది. 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగాల ద్వారా రూ. 1500 కోట్ల విలువైన పలు అభివృద్ది పనులు జరిగాయి.
మెయింటనెన్స్, ప్రాజెక్ట్స్, హౌసింగ్ విభాగాల ద్వారా జరిగిన ఈ పనులపై క్వాలిటీ కంట్రోల్ విభాగం పనులు జరిగేటప్పుడు, పూర్తయిన అనంతరం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల సందర్భంగా లోపాలను గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి రూ. 1.55 కోట్లలను రికవరీ చేసింది. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ మెయింటనెన్స్ విభాగం ద్వారా జరిగిన జనరల్ పనులకు రూ. 1.34 లక్షలు, సీఆర్ఎంపీ పనులకు రూ. 6.74 లక్షలు, ప్రాజెక్ట్స్ విభాగం ద్వారా రూ. 10.60 లక్షలు, హౌసింగ్ విభాగం ద్వారా రూ. 3.23 లక్షలు పెనాల్టీని సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా రికవరీచేసి పనులను సక్రమంగా చేపట్టినట్లు జీహెచ్ఎంసీ క్వాలిటీ కంట్రోల్ విభాగం తెలిపింది.