కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా ఆర్థిక కార్యకలాపాలు తగ్గించి, జాతీయ స్థాయిలో కీలక చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సమాఖ్య-సీఐఐ కేంద్రానికి సూచించింది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున.. ప్రస్తుతం జీవితాలను రక్షించడం కీలకమని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు.
"ప్రస్తుత పరిస్థితిని అదుపు చేసేందుకు హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతమున్న వైద్య సాంకేతికతతో భారీగా పెరుగుతున్న కేసులను అదుపు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈ విషయంలో మనం కచ్చితంగా దేశీయ, విదేశీ నిపుణుల సలహాలు తీసుకోవాలి."
-ఉదయ్ కోటక్, సీఐఐ అధ్యక్షుడు
వైద్య సిబ్బంది భద్రత, మెడికల్ లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రక్షణకు సాయుధ బలగాలను మోహరించాలని కూడా కేంద్రానికి సూచించింది సీఐఐ. టీకా వేసేందుకు, ఇతర వైద్య అవసరాలకు విశ్రాంత వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులను ఉపయోగించుకోవాలని కోరింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సంఖ్యను రెట్టింపు చేయాలని సీఐఐ కోరింది.