UAEలో మోదీకి ఘన స్వాగతం.. బుర్జ్‌ ఖలీఫాపై త్రివర్ణ పతాకం రెపరెపలు

By

Published : Jul 15, 2023, 2:27 PM IST

thumbnail

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫాపై భారత మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. ప్రధానికి ఆహ్వానం పలుకుతూ బుర్జ్‌ ఖలీఫాపై జాతీయ పతాకంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించారు అక్కడి అధికారులు. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకరోజు పర్యటన కోసం శనివారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌-యూఏఈ చేరుకున్నారు. అబుదాబి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. యూఏఈ యువరాజు షేక్‌ ఖాలిద్‌ బిన్‌ మొహమద్‌ బిన్‌ జాయెద్‌.. మోదీకి సాదరస్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోదీ. తన స్నేహితుడు, యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు.. యూఏఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

భారత్‌-యూఏఈ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆహారభద్రత, శాస్త్ర సాంకేతికత, విద్య, ఫిన్‌టెక్‌, రక్షణ, భద్రత తదితర రంగాల్లో సంబంధాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇంధనం, ఆహారభద్రత, రక్షణ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని ప్రధాని మోదీ.. యూఏఈ అధ్యక్షుడితో సమీక్షించనున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.