దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడవడంతో ఆయన అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కైకాల మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుఝామున కైకాల కన్నుమూయగా.. శనివారం అభిమానులు, చలనచిత్ర ప్రముఖుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. అధికారిక లాంఛనాలతో జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, కైకాల అంతిమయాత్ర పటిష్ఠ బందోబస్తుతో ఫిల్మ్నగర్లోని ఆయన ఇంటి నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగింది. ఈ అంతిమ యాత్రలో కైకాల కుటుంబ సభ్యులు, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
ఆ నాటకంతో.. కృష్ణా జిల్లా కౌతవరంలో 1935 జులై 25న పుట్టిన ఆయన గుడ్లవల్లేరు లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.. పై చదువుల కోసం విజయవాడకు వచ్చిన కైకాల తిరిగి గుడివాడకు వచ్చారు. కాలేజీ డేస్లో నాటకాలపైన ఆయనకు విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకపోటీల్లో పాల్గొనేవారు. అలా 1952లో ఆచార్య ఆత్రేయ రాసిన నాటకం "ఎవరు దొంగ"ను ప్రదర్శించారు సత్యనారాయణ. ఆ నాటకాన్ని చూసిన సినీ దర్శకుడు గరికపాటి రాజారావు.నీ ముఖవర్చస్సు బాగుందని సినిమాల్లోకి రావాలని ఆహ్వానించారు. డిగ్రీ పూర్తైన తర్వాతే సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తానని సత్యనారాయణ చెప్పటంతో రాజారావు అందుకు అంగీకరించారు. ఎల్వీ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ గా చేరిన మిత్రుడు కేఎల్ ధర్ కూడా అదే చెప్పటంతో మద్రాసుకు పయనమయ్యారు కైకాల సత్యనారాయణ.
![Senior Actor Kaikala Satyanarayana cremations over](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17297538_kaikalla-2.jpg)
ఎన్నో తిరస్కరణలు.. మద్రాసు వెళ్లినా..సినీ అవకాశాలు అంత తేలిగ్గా సత్యనారాయణను వరించలేదు. మిత్రులంతా హీరోలా ఉంటావని ఇచ్చిన ప్రోత్సాహంతో చెన్నపట్టణానికి వచ్చిన సత్యనారాయణ ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొన్నారు. కాదనిపించుకున్న ప్రతీసారి ఇంటికి వెళ్లిపోదామనే ఆలోచన ఆయను మెదడును తొలిచినా.. తనను తాను నిరూపించుకోవాలనే సంకల్ప బలమే ఆ ఆలోచనలను విరమించుకునేలా చేసింది. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత తొలి అవకాశం అందుకున్నారు కైకాల.
అదే మొదటి సినిమా.. దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ 'కొడుకులు-కోడళ్లు' అనే సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్స్ లో పాల్గొన్నారు. సత్యనారాయణకు ఎల్వీ ప్రసాద్ స్క్రీన్ టెస్టులన్నీ చేసి ఓకే చేశారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభం కాలేదు. మొక్కవోని ధైర్యంతో సత్యనారాయణ దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావును కలిశారు. ఆయన సత్యనారాయణను ప్రముఖ దర్శకనిర్మాత కె.వి.రెడ్డి వద్దకు పంపితే ఆయన మేకప్ టెస్ట్, వాయిస్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ అన్నీ చేయించి కూడా అవకాశం కల్పించలేకపోయారు. అలా 'దొంగరాముడు' సినిమాలో తనకు దక్కాల్సిన పాత్ర ఆర్.నాగేశ్వరరావుకు దక్కింది. చివరకు దేవదాసు నిర్మాత డీఎల్ నారాయణ సత్యనారాయణ రూపాన్ని చూసి, అతని గెటప్ నచ్చి, చందమామ బ్యానర్పై చెంగయ్య దర్శకత్వంలో తీసిన 'సిపాయి కూతురు'లో హీరోగా జమున సరసన నటింపజేశారు. అదే సత్యనారాయణకు మొదటి సినిమా. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు.
![Senior Actor Kaikala Satyanarayana cremations over](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17297538_kaikalla-1.jpg)
ఎన్టీఆర్కు డూప్గా.. ఎన్టీఆర్కు దగ్గర పోలికలుండటం చేత సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా చాలా సినిమాల్లో నటించారు. 1960లో ఎన్టీఆర్ చొరవతోనే మోడరన్ థియేటర్స్ వారి ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో నటుడిగా అవకాశాన్ని అందుకున్నారు. ఆ సినిమా దర్శకుడు ఎస్డీ లాల్ విఠలాచార్య శిష్యుడు కావటంతో.. సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్ను గుర్తించి విఠలాచార్యకు పరిచయం చేశారు. అదే సత్యనారాయణ కెరీర్ లో కీలక మలుపు. హీరో వేషాల కోసం వేచి చూడకుండా విలన్ లు తక్కువగా ఉన్న ఇండస్ట్రీలో కొరతను తీరుస్తూ అవకాశాలను అందుకోవాలని విఠలాచార్య ఇచ్చిన సలహాను సత్యనారాయణ స్వీకరించారు.
![Senior Actor Kaikala Satyanarayana cremations over](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17297538_kaikalaaaa123.jpg)
ఇదీ చూడండి:
- కైకాలను కడసారి చూసేందుకు తరలివస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు..
- సారీ పూజమ్మా అందులో ఎటువంటి నిజం లేదా
- కైకాల భౌతికకాయం వద్ద కన్నీరు పెట్టిన చిరంజీవి ఓదార్చిన పవన్