'బోస్ త్యాగాలు వెలుగులోకి రాకుండా చేసేందుకు కుట్ర.. కానీ..' - అండమాన్లో సుభాష్ చంద్రబోస్ 126 జయంతి వేడుకలు
స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కృషిని వెలుగులోకి రాకుండా చూసేందుకు ప్రయత్నించారని ప్రధాని మోదీ ఆరోపించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్మించబోయే నేతాజీ జాతీయ స్మారకం నమూనాను మోదీ ఆవిష్కరించారు. దేశంలో తొలుత త్రివర్ణ పతాకం మొదటిసారిగా అండమాన్లోనే రెపరెపలాడిందని గుర్తుచేశారు.

స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన కృషిని వెలుగులోకి రాకుండా చూసేందుకు ప్రయత్నించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ దేశం మొత్తం ఆయనను నేడు స్మరించుకుంటుందని తెలిపారు. నేతాజీ రహస్య పత్రాలను బహిరంగ పర్చాలన్న డిమాండ్కు అనుగుణంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్మించబోయే సుభాష్ చంద్రబోష్ జాతీయ స్మారకం నమూనాను సోమవారం నేతాజీ 126వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ స్మారక చిహ్నం ప్రజల హృదయాలలో దేశభక్తి భావాలను నింపుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొన్నారు.
"దేశం మొత్తం నేతాజీ సుభాష్ చంద్రబోష్కు నివాళులు అర్పిస్తోంది. నేతాజీ వారసత్వాన్ని కాపాడుతోంది. స్వాతంత్ర్య పోరాట చరిత్రను తెలుకోవడానికి ప్రజలు అండమాన్ను సందర్శిస్తున్నారు. దేశంలో తొలిసారిగా త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన నేల అండమాన్ నికోబార్ దీవులు. దేశం మొత్తం నేతాజీ జన్మదినాన్ని పరాక్రమ దివస్గా జరుపుకుంటోంది. అండమాన్లోని దీవులకు 21 మంది పరమవీరచక్ర గ్రహీతల పేర్లను పెట్టడం ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోతుంది."
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్తో పాటు అనేక మంది దేశ భక్తులు అండమాన్ జైలులోనే శిక్ష అనుభవించారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1943లో నేతాజీ అండమాన్లోనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని పేర్కొన్నారు. నేతాజీ త్రివర్ణ పతాకం ఎగురవేసిన అండమాన్ నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు.


భారత్ను 'విశ్వగురువు'గా చేయడమే లక్ష్యం..
భారత్ను 'విశ్వగురువు'గా తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్యమని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నేతాజీ లౌకికవాదాన్ని విశ్వసించారని.. హిందూత్వ భావజాలానికి వ్యతిరేకమని ఆరోపణల నేపథ్యంలో భగవత్ ఈ విధంగా స్పందించారు. దేశ ప్రజలందరూ నేతాజీ లక్షణాలను అలవరుచుకోవాలని ఆయన కోరారు. స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్ను గొప్పగా తీర్చిదిద్దాలన్న నేతాజీ కల ఇప్పటికీ నేరవేరలేదని.. ఆ దిశగా ప్రజలందరూ కృషి చేయాలని మోహన్ భగవత్ కోరారు. కోల్కతాలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నేతాజీ 126వ జయంతి వేడుకల్లో భగవత్ పాల్గొని ప్రసంగించారు.
1897 జనవరి 23న కోల్కతాలో సుభాష్ చంద్రబోస్ జన్మించారు. ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1945 ఆగస్ట్ 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారు.