తిరుపతి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసి విచారించాలి : సీపీఐ నారాయణ - CPI Narayana On Tirupati Laddu
Published : 2 hours ago
CPI K Narayana On Tirupati Laddu Matter : తిరుపతి బాలాజీ దేవస్థానం ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన విషయం వెలుగులోకి రాగానే దేశంలో రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనపై శనివారం బిహార్లోని పట్నాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పందించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు స్వయంచాలకంగా విచారణ చేపట్టి ఉండాల్సిందని అన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెయ్యి సరఫరా టెండర్ను మార్చినప్పుడు, తిరుమల దేవస్థానం బోర్డు వారు ప్రసాదంలో వాడే నెయ్యిపై ఆనాటి నుంచే విచారణ చేయాల్సి ఉందని, వారు చేయలేదని నారాయణ స్పష్టంగా చెప్పారు.
ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు బాలాజీ ఆలయానికి వస్తారని, ప్రసాదం సమర్పించి సేవిస్తారని తెలిపారు. దీంతో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. ఇది క్షమించరాని తప్పు అని ఆయన ఆక్షేపించారు. ఆలయ నిర్వహణపై విమర్శలు చేయడంతో పాటు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని తీరుపై కూడా విచారణ జరగాలన్నారు. గతంలో నెయ్యి సరఫరా చేసే కంపెనీకి కిలో రూ.1000 చొప్పున ఉండేదని, మరి ఏ ప్రాతిపదికన రూ.330కే నెయ్యి కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. దీనిపై రాజకీయాలు ఉండకూడదని, సుప్రీంకోర్టు స్వయంచాలకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి, కమిటీ వేసి విచారణ చేపట్టాలని కోరారు.