ఆందోళన వద్దు - అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం: కలెక్టర్ సృజన
By ETV Bharat Andhra Pradesh Team
Published : 8 hours ago
Collector on Flood Relief to Victims: వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్ పడిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. పెండింగ్లో ఉన్న 18 వేల కుటుంబాలకు గాను 4 వేల కుటుంబాలు ఇప్పటికే ఖాతాలను సరిచేసుకోవడం వల్ల పరిహారం అందిందన్నారు. మిగిలిన 14 వేల కుటుంబాలకు సంబంధించి ఖాతాలను సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రభుత్వమే పరిష్కరించిందని, వీరికి రెండు రోజుల్లో పరిహారం అందుతుందని వెల్లడించారు. పలు కారణాలవల్ల పరిహారం అందజేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు గుర్తించామన్నారు. వాటిని సచివాలయాల కార్యదర్శులు ఆయా కుటుంబాలను సంప్రదించి సరిచేశారని తెలిపారు. పరిహారం కోసం కలెక్టరేట్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు.