ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులకు ప్రభుత్వం కసరత్తు - అధ్యయనానికి 19 మంది సభ్యులతో కమిటీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 10:25 PM IST
Government has Appointed Committee to Restructure the Excise Department : ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులు, చేర్పులపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆబ్కారీ శాఖ పనితీరును మెరుగు పర్చేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు 19 మంది సభ్యులతో కూడిన అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకూ కమిటీలో సభ్యులుగా పేర్కోంది. ఒకే గొడుగు కిందకు అబ్కారీ శాఖను తెచ్చేలా అధ్యయనం చేయాలని వెల్లడించింది. ఎక్సైజు శాఖలో సంస్థాగత మార్పులు తీసుకువస్తామంటూ ప్రభుత్వం శ్వేతపత్రంలో చేసిన ప్రస్తావన మేరకు ఈ కమిటీని నియమించింది. ఆగస్టు 3వ తేదీనాటికి దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.