హింసాత్మకంగా మారిన నిరసనలు- పార్లమెంట్కు నిప్పు- అనేక మంది మృతి! భారతీయులకు అడ్వైజరీ
Published : Jun 26, 2024, 8:13 AM IST
|Updated : Jun 26, 2024, 9:15 AM IST
Kenya Tax Protests : కెన్యాలో పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారనీ 31 మంది గాయపడ్డారని తెలుస్తోంది. స్థానిక వైద్య సిబ్బంది ప్రకారం మృతుల సంఖ్య 10 వరకు ఉందని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు సంబంధించి కెన్యా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని మంగళవారం రాజధాని నైరోబీలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళన కారులు కుర్చీలు, బల్లలు, తలుపులు, ధ్వంసంచేసి నిప్పంటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఆందోళనల నేపథ్యంలో కెన్యాలో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత హై కమిషన్ సూచించింది.