మెట్రో రైలులో రాష్ట్రపతి- విద్యార్థులతో కోహ్లీ గురించి ముచ్చట్లు! - President Travelled In Metro Train
Published : Feb 7, 2024, 2:42 PM IST
Draupadi Murmu In Delhi Metro : దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ సెక్యూరిటీ నడుమ ఆమె బుధవారం ఉదయం మెట్రో ట్రైన్ ఎక్కారు. డార్క్ ఎల్లో కలర్ శారీపై చాక్లెట్ కలర్ స్వెటర్ను ధరించి ఆమె వీడియోలో కనిపించారు. మెట్రో అధికారులు, సిబ్బందితో కలిసి ఆమె కాసేపు మాట్లాడారు. ట్రైన్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని ఓ పాఠశాల విద్యార్థుల బృందంతో ద్రౌపది సరదాగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా కొందరు విద్యార్థినులు పాటలు పాడారు. వారిని ఆమె ప్రశంసించారు. అలా మెట్రో పరుగులు తీస్తుండగానే పక్కనే కూర్చున్న కొందరు విద్యార్థినులను మీరు పెద్దయ్యాక ఏం కావాలి అని అనుకుంటున్నారు అని అడిగారు ముర్ము. చాలా మంది విద్యార్థినులు డాక్టర్ అవ్వడం తమ గోల్ అని బదులిచ్చారు. కాగా, మరో విద్యార్థిని అదే ప్రశ్న అడగ్గా తాను క్రికెటర్ను అవ్వాలనుకుంటున్నా అని సమాధానిమిచ్చాడు. ఈ క్రమంలో తన నోటి వెంట స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావించారు రాష్ట్రపతి. పెద్దయ్యాక నీవు కూడా విరాట్ కంటే ఎక్కువ పరుగులు సాధించాలని విద్యార్థితో సరదాగా నవ్వుతూ అన్నారు. ఇక కొందరు విద్యార్థులు పరీక్షల ఒత్తిడి నుంచి ఎలా బయట పడాలి అని అడిగిన ప్రశ్నలకు ఆమె పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.