కేంద్ర, ప్రపంచ బ్యాంకు నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించింది : కేంద్ర మంత్రి పెమ్మసాని - Pemmasani review on GMC works
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 6:52 PM IST
Central Minister Pemmasani Review on GMC Works : కేంద్రం, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించటంతో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్, అధికారులు, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో కలెక్టరేట్లో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. నగరంలో తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజ్, రహదారులు, ఇతర పనులకు కేటాయించిన వందల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం మెుత్తం ఖజానాను ఖాళీ చేసిందని మండిపడ్డారు.
దీంతో నగర వాసులకు అత్యవసరమైన మౌలిక వసతులు కల్పనకు కూడా నిధులు లేని పరిస్థితి వచ్చిందన్నారు. నిధులు సమీకరించేందుకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామని పెమ్మసాని తెలిపారు. అలాగే వీలైనంత త్వరగా తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేషన్ నిధులు కూడా వైసీపీ దుర్వినియోగం చేసిందని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలిచిపోయిన పనులు త్వరితగతిన పూర్తిచేసి నగర వాసులకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.