పవన్ కల్యాణ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: సీపీఐ రామకృష్ణ - CPI Ramakrishna on Pawan Kalyan
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
CPI Ramakrishna Comments on Pawan Kalyan : లౌకికవాదినంటూ గతంలో చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు సనాతన హిందువునని చెబుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సనాతన ధర్మం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిచ్చిన డైలాగులనే పవన్ వల్లె వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కులం లేదు మతం లేదు నేను లౌకికవాదిని అని చెప్పిన పవన్ నేడు తాను సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడేందుకు రాజకీయంగా నష్టపోయిన పర్వాలేదని విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని అన్నారు.
బీజేపీ , మజిలీస్ పార్టీల మినహా అన్ని పార్టీల్లో లౌకికవాదులు ఉన్నారని తెలిపారు. పవన్ కల్యాణ్కి అన్ని మతాలలో, అన్ని వర్గాలలో అభిమానులు ఉన్నారని రామకృష్ణ గుర్తు చేశారు. సనాతన ధర్మం పాటించడం అంటే అణగారిన వర్గాలకు అండగా నిలబడి వారిని ఆదుకోవడమేనని అన్నారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడడాన్ని ప్రజలు హర్షించరని సీపీఐ రామకృష్ణ హితవు పలికారు.