Published : Aug 26, 2024, 10:10 PM IST
బండపై నైవేద్యాన్ని ఉంచి నాకితే వర్షాలు పడతాయట - ఈ గ్రామ ప్రజల వింత ఆచారం - Different Culture In Medak district
A strange custom In Village : బండపై నైవేద్యాన్ని ఉంచి నాకితే వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు బాగా పండుతాయని అక్కడి వారి విశ్వాసం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్లో ఈ వింత ఆచారాన్ని గ్రామస్తులు పాటిస్తున్నారు. శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా 'బండమీది పాయసం' అనే కార్యక్రమాన్ని స్థానికులు నిర్వహించారు.
బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం వద్ద వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడిపంటలు బాగా పండాలని కోరుకుంటూ 'బండమీది పాయసం' అనే వినూత్న కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. కొండగుట్టల మధ్య వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బండమీది పాయసం కార్యక్రమాన్ని చేశామని ఆలయ నిర్వాహకులు తలారి మల్లేశం తెలిపారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాన్ని బండపై ఉంచి భక్తులు నాలికతో ఆ పాయసాన్ని తిన్నారు. ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా తరలివచ్చారు.