తెలంగాణ

telangana

ETV Bharat / state

కనిపెంచిన అమ్మకే అమ్మయిన చిన్నారి - పదేళ్ల చిట్టితల్లి కన్నీటి గాథ - DAUGHTER TAKING CARE MOTHER

అమ్మకు అమ్మయిన చిన్నారి - అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తల్లి - ఇల్లు, ఫించన్ ఇప్పించాలంటూ అధికారులను వేడుకున్న చిన్నారి

WAITING FOR PENSION IN SURYAPET
Daughter Taking Care Mother In Suryapet (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2025, 10:01 AM IST

Daughter Taking Care Mother : అందరి పిల్లలాగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ చిన్నారి తల్లికే అమ్మగా మారి సేవలు చేస్తుంది. అమ్మ చేతి ముద్దలు తినాల్సిన చిరుప్రాయంలో అమ్మకే అన్నం కలిపి పెట్టాల్సిన పరిస్థితి. విధి‌ ఆడిన వింత నాటకం ఏ చిన్నారికీ రాని కష్టమిది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం అధికారులు ఈ చిన్నారి ఇంటికి వెళ్లారు. అమ్మ నిలబడలేదంటూ ఇంటి ముందు నేను నిలబడతా నన్ను ఫోటో తీసి ఇల్లు ఇప్పించాలంటూ వేడుకుంది. దీంతో ఈ చిట్టితల్లితో పాటు ఆ కుటుంబ దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది.

అమ్మకు సేవలు చేస్తూ బడికి : సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన సయ్యద్‌ పాషా, సలీమా దంపతులకు కుమారుడు సమీర్, కుమార్తె రిజ్వాన సంతానం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో కుమారుడు ఏడో తరగతి, కుమార్తె ఐదో తరగతి చదువుతున్నారు. తొమ్మిది సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగగా క్షణికావేశంలో సలీమా ఒంటికి నిప్పంటించుకుంది.

కాలిన శరీర భాగాలు : దీంతో ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. శరీరం మొత్తం కాలిపోవడంతో కొన్నాళ్లు ఆమె మంచానికే పరిమితమైంది. తర్వాత కొన్నాళ్లకు భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ భారాన్ని మోసే బాధ్యత ఆమెపైనే పడింది. కాలిన గాయాలతోనే కూలి పనులకు వెళ్తూ పిల్లలను పోషించింది. కాని గత కొంతకాలంగా కాలిన శరీర భాగాలు బిగుసుకుపోయి కాళ్లు, చేతుల నరాలు పనిచేయకపోవడంతో ఆమె కనీసం నిలబడలేక పోతుంది. ఆమె పనికి వెళ్లక పూట గడవడమూ కష్టమైంది. పండుగల సమయంలో సాటి ముస్లింలు, ఇతరులు అందించే చేయూత, దాతల సహకారంపైనే ఆ కుటుంబం ఆధారపడుతుంది.

చేతివేళ్లు కాలిపోవడంతో ఫించన్ రావట్లేదు : అప్పట్నుంచి పదేళ్ల కుమార్తె అమ్మ బాధ్యతలు తీసుకుంది. సలీమాకు తల్లిగా మారింది. కదల్లేని స్థితిలో ఉన్న తల్లికి సపర్యలు చేస్తూనే వంటచేసి తల్లికి తినిపించిన తర్వాత బడికి వెళ్తోంది. దాతలు సహకరించి అమ్మకు వైద్యం చేయిస్తే కష్టాల నుంచి బయటపడతామంటూ రిజ్వాన వేడుకుంటోంది. అమ్మ దివ్యాంగుల పింఛనుకు అర్హురాలని కాని సదరం ధ్రువీకరణకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే వేలిముద్రలు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారని చిన్నారి తెలిపింది. చేతివేళ్లు కాలిపోవడంతో వేలిముద్రలు పడడంలేదని దీంతో పింఛను రావట్లేదని ఆ చిన్నారి కన్నీరు పెట్టుకుంది. తనకు పింఛను, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తే బిడ్డలకు ఆసరా అవుతోందని సలీమా చేతులు జోడిస్తూ వేడుకుంటుంది.

సీఎం రేవంత్‌రెడ్డి స్పందన :'అమ్మకు అమ్మయింది..కదిలిస్తే కన్నీటి చెమ్మయ్యింది' కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సలీమాకు వైద్య సహాయం చేసి, పింఛను ఇవ్వాలని తాజాగా సీఎం అధికారులను ఆదేశించారు. సలీమాకు ఇందిరమ్మ ఇల్లుతో పాటు భోజన సదుపాయం కూడా కల్పించాలని అన్నారు. దీంతో వెంటనే సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు సూర్యాపేట కలెక్టర్‌తో చర్చించారు.

స్పందించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ : ఈనాడు/ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు. కనిపెంచిన ఆమ్మకే అమ్మయిన ఆ చిన్నారి కథనం తనను కదిలించిందన్నారు. ఈ మేరకు ప్రచురితమైన కథనాన్ని ‘ఎక్స్‌’లో సజ్జనార్‌ పోస్టు చేశారు.

కనిపెంచిన అమ్మకే అమ్మగా మారిన ఈ చిన్నారి కథనం తన మనసుని కదిలించిందని తెలిపారు. మంచానికే పరిమితమైన తన తల్లికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈ పదేళ్ల చిన్నారి ప్రేమను ఏమని వర్ణించగలమన్నారు. అమ్మ చేతి ముద్ద తినాల్సిన చిరుప్రాయంలో కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది ఈ చిట్టితల్లి అని బాధపడ్డారు.

"ఈ చిట్టి తల్లి కుటుంబానికి ఆపన్నహస్తం అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. సాయం చేసే చేతులు స్పందించాల్సిన సమయం ఇది. మనకి తోచిన సాయం చేద్దాం. మనమందరం అండగా ఉన్నామనే భరోసా ఆ చిన్నారికి కలిపిద్దాం’’- వీసీ సజ్జనార్‌, ఆర్టీసీ ఎండీ

స్పందించిన జిల్లా యంత్రాంగం : 'అమ్మకు అమ్మయింది...కదిలిస్తే కన్నీటి చెమ్మయ్యింది' అని ప్రచురితమైన ఈనాడు-ఈటీవీ భారత్ కథనాలకు సూర్యాపేట జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా పోలీస్ శాఖ తెలిపింది. రిజ్వాన చదువు, గృహం మరమ్మతులు, నిర్మాణానికి అన్ని విధాల సాయం చేస్తామని, అవసరమైతే సలీమాకు హైదరాబాద్‌లో చికిత్స అందించాడానికి ఏర్పాట్లు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. వ్యక్తిగత సాయం కింద రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని డీఎస్పీ రవి అందించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల రూ.4 వేలు సాయం జిల్లా సంక్షేమ అధికారి ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావు సహాయం చేయడానికి ముందుకొచ్చారు.

ఇది కదా నిజమైన ప్రేమంటే! - దివ్యాంగురాలైన భార్యకు అన్నీ తానైన భర్త

'మా నాన్నను చూసేందుకు వచ్చా మేడం' : కోర్టు రూమ్​లో ఆరేళ్ల చిన్నారి

ABOUT THE AUTHOR

...view details