ఆడుకుంటూ రైలెక్కిన పిల్లలు - కిడ్నాప్ చేయాలనుకున్న ఆటో డ్రైవర్ - చివరలో ట్విస్ట్? - POLICE SAVED TWO KIDS FROM KIDNAP
Published : Jul 3, 2024, 12:32 PM IST
Officers Saved Children in Hyderabad : ఆడుకుంటూ రైలు ఎక్కి తప్పిపోయిన పిల్లల్ని ట్రాఫిక్ పోలీసులు కాపాడారు. పిల్లల్ని ఆటో డ్రైవర్ అపహరించే ప్రయత్నం చేయగా, వారిని రక్షించిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
![ఆడుకుంటూ రైలెక్కిన పిల్లలు - కిడ్నాప్ చేయాలనుకున్న ఆటో డ్రైవర్ - చివరలో ట్విస్ట్? - POLICE SAVED TWO KIDS FROM KIDNAP Officers Saved Children in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-07-2024/1200-675-21855564-thumbnail-16x9-officials.jpg)
Traffic Police Save the Children in Hyderabad : ఇంట్లో చిన్నపిల్లు ఉన్నారంటే వారి అల్లరి అంతా ఇంతా ఉండదు. వారిని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. లేదా పిల్లలు తెలియక చేసే పనులు ఒక్కొసారి పెద్దలకు ఇబ్బందులను తీసుకువస్తాయి. ఎంత అదుపులో ఉంచుదామన్నా, పిల్లలు తెలియనితనంతో ఏదో కొంటె పనులు చేస్తూనే ఉంటారు. తాజాగా పిల్లలు ఆటలాడుతూ రైలు ఎక్కిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎటువెళ్తున్నారో తెలియకుండానే ఆడుకుంటూ రైలెక్కిన చిన్నారులు, గమ్యం తెలియక మరో స్టేషన్లో దిగారు. పిల్లలు ఒంటరిగా కనిపించడం, పెద్ద వాళ్లెవరూ పక్కన లేరని గమనించిన ఓ ఆటో డ్రైవర్ వారిని ఫాలో అయ్యాడు. వాళ్లు ఒంటరిగానే ఉన్నారని కన్ఫామ్ చేసుకున్న తర్వాత వారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ చివరలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అతడి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన మంగళవారం రోజున మైలార్దేవుపల్లి డివిజన్లో చోటుచేసుకుంది.
రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బిల్లా కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కార్తిక్(6), అఖిల్(4) ఇద్దరు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బుద్వేల్ రైల్వేస్టేషన్లో శంషాబాద్లోని ఉందానగర్ మీదుగా వచ్చే రైలు నుంచి దిగారు. ఇంటికి వెళ్లడానికి దారి తెలియని చిన్నారులు బయటకు వచ్చి కాలినడకన ఆరాంఘర్ చౌరస్తా దాటుతుండగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఠాణా సమీపంలోకి రాగా ఓ ఆటోవాలా వారిని వెంబడిస్తూ అపహరించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు యాదయ్య, వెంకట్రెడ్డి, శివలు గుర్తించారు. అతడిని పట్టుకునేలోగా ఆటో డ్రైవర్ అప్రమత్తమై పరారయ్యాడు.
వెంటనే ఇద్దరు చిన్నారులను చేరదీసి విచారించగా సరైన సమాధానం చెప్పలేదు. పెద్దబ్బాయి శంషాబాద్ నుంచి వచ్చినట్లు చెప్పడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఇంతలో తమ పిల్లలు ఎక్కడికెళ్లారోనని గాలిస్తున్న శంషాబాద్ శివారున గుడిసెలో నివసించే మాతృమూర్తి శైలజ సమాచారం అందుకుని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆమెకు కౌన్సిలింగ్ చేసి పిల్లలను అప్పగించారు.
పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి: పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో వారిని ఓ కంట కనిపెడతూ ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే, ఇంటి పక్కన వారిని కనిపెడుతూ ఉండేలా సూచించాలని చెప్పారు. నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.