తెలంగాణ

telangana

హైదరాబాద్​ వాసులను అడుగు బయట పెట్టనియ్యలె - ఎడతెరిపిలేని వానలతో నగరంలో ముగ్గురి మృతి - HYDERABAD RAINS 2024

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 6:48 AM IST

Updated : Sep 2, 2024, 6:53 AM IST

Hyderabad Rains 2024 : రెండు రోజుల పాటు తెరిపిలేని వానలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. కాలనీలు జలమయమై, రోడ్లపై వరద పొంగుతుండగా, హుస్సేన్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అనేక చోట్ల భారీ వృక్షాలు, కరెంట్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ సంస్థ - హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సహాయక చర్యలు చేపట్టారు. ఘట్​కేసర్‌లో విద్యుత్‌ షాక్‌తో ఒకరు, షాద్‌నగర్‌లో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌ అనుదీప్‌, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

Hevay Floods Hit Hyderabad
Hyderabad Rains 2024 (ETV Bharat)

Heavy Floods in Hyderabad :వరుసగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్‌, రంగారెడ్డి జి‌ల్లాల్లో జనజీవనం స్తంభించింది. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని హుస్సేన్‌సాగర్‌ నాలా పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌పై ఉన్న చెట్లు, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ రోడ్డుపై విరిగిపడ్డాయి. హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారడంతో సమీపంలోని నాలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి.

కరెంట్‌ షాక్‌తో ప్రిన్సిపల్ మృతి : గాజులరామారంలోని పలు కాలనీలు జలమయం కాగా, రోడ్లపై వరద ప్రవహిస్తోంది. మేడ్చల్‌, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పంట పొలాలు నీటమునిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు వరద ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది తప్పలేదు. ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇంటిపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగిస్తుండగా, కరెంట్‌ తీగలు తగిలి ప్రైవేట్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

చిన్నారి మృతి : రంగారెడ్డి జిల్లా దేవునిపల్లిలో చేపల వేటకు వెళ్లిన శేఖర్‌ చెరువులో పడి ప్రాణాలొదిలాడు. షాద్‌నగర్‌లోని నోబుల్‌ పార్క్‌ కాలనీ వర్షం నీటిలో పడి 13 నెలల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు, బిహార్‌కు చెందిన మీర్‌ అహ్మద్‌, రోఫన్ దంపతులు ఓ భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. షాద్‌నగర్‌ బైపాస్‌ కేశంపేట రోడ్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి గేదె చనిపోయింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు, మూసీ వరద నీటి నిల్వలను, ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లలో వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి మూసీలోకి వదులుతున్నట్లు వెల్లడించారు. ఎక్కడికక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని, సమస్యలు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌నకు సమాచారమివ్వాలని కలెక్టర్‌ అనుదీప్‌ విజ్ఞప్తి చేశారు. నేడు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

"ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాం. ఎక్కడికక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటు చేశాం. సమస్యలు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారమివ్వాలి. నేడు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాము".- అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్‌ కలెక్టర్

రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ - IMD Officer On Weather Report

సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్​ క్లోజ్​! - ప్రయాణం వాయిదా బెస్ట్ - Hyd to Vijayawada highway closed

Last Updated : Sep 2, 2024, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details