IMD Officer On Telangana Weather Report :రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, మహాబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో సాధారణాన్ని మించి రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గాలి అనిశ్చితి వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ మేర తగ్గే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. గాలి అనిశ్చితి కారణంగా ఒకరోజు ఉత్తర తెలంగాణలో, మరోరోజు దక్షిణ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు. ఈ మేరకు తెలంగాణ వాతావరణ పరిస్థితిపై ఆయన వివరాలను వెల్లడించారు.
గాలిలోని తేమ పెరగడమే ఉక్కపోతకు కారణం :వేసవి కాలంలో వడగాలులు ఎలా ఉంటాయనే వివరాలకు సంబంధించిన అంచనాల రిపోర్టును ఫిబ్రవరి నెలఖరున ఐఎండీ విడుదల చేస్తుందని వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. గాలిలోకి తేమ ప్రవేశించడం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లుగా అనుభూతి ఉంటుందని, ఫలితంగా శరీరానికి మంట కలిగినట్లుగా ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉత్తర, ఆగ్నేయ దిశనుంచి గాలులు వచ్చినప్పుడు గాలిలోకి తేమ ప్రవేశించి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లుగా ఫీల్ ఉంటుందని వాతావరణ అధికారి తెలిపారు. రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఆయన వివరించారు. గాలిలోని అనిశ్చితి కారణంగానే భిన్నవాతావరణం కనిపిస్తోందని వివరించారు.