Daunting SLBC Tunnel Rescue Continues : మూడు రోజులు గడిచాయి! ఆచూకీ కోసం అన్వేషణ ఆగలేదు. 8మంది జాడ కనిపెట్టేందుకు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్యూ బృందాలు అలుపెరుగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ సానుకూలత కనిపించడం లేదు. ఇదీ ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పైకప్పు కూలి ప్రమాద స్థలిలో నెలకొన్న పరిస్థితి. ఉత్తరాఖండ్లో జరిగిన విపత్తుల్లో రెస్క్యూ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిన బృందాలు సైతం పాలుపంచుకుంటున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు :ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగలకు చెందిన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు ఏడు సార్లు టన్నెల్లో సహాయక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఉత్తరాఖండ్లో జరిగిన విపత్తులలో రెస్క్యూ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిన బృందాలను రంగంలోకి దిగాయి. ఈ బృందంలో దాదాపు 584 నిపుణులైన సిబ్బంది ఉన్నారు. వీరితోపాటు 14 మంది ర్యాట్ హోల్ టీమ్స్ సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు.
బురదనీరు తొలగింపు తర్వాతే :మధ్యాహ్నం డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలతో పాటు వాకీటాకీ సిగ్నల్ పరికరాలనూ సొరంగంలోకి తీసుకెళ్లారు. విరిగిన టీబీఎం భాగాన్ని బయటకు తీయాలని రెస్క్యూ టీం భావిస్తోంది. ఐతే ముక్కలైన పరికరాల కారణంగా వెలికితీతకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. బురదనీరు తొలగింపు తర్వాతే ప్రమాదస్థలికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.