తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లో సహాయక చర్యలు - 13.5 కి.మీ వరకు వెళ్లిన రెస్క్యూ టీం - SLBC TUNNEL ACCIDENT UPDATE

ఎస్​ఎల్​బీసీ సొరంగం ప్రమాదం - సహాయక చర్యలు చేస్తున్న ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు

SLBC TUNNEL ACCIDENT UPDATE
SLBC TUNNEL ACCIDENT UPDATE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2025, 8:00 AM IST

SLBC Tunnel Accident Update :ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఇండియన్​ ఆర్మీ టీం, రెస్క్యూ టీం, 130 మంది ఎన్డీఆర్​ఎఫ్​ బృందం, 24 మందితో కూడిన హైడ్రా, సింగరేణి కాలరీస్​ నుంచి 24 మందితో రెస్క్యూ టీం, 120 మంది ఎస్​డీఆర్​ఎఫ్​ టీం పాల్గొన్నాయి. సహాయక చర్యలకు ఘటనాస్థలిలో కూలిన మట్టి, నీటితో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఎస్​ఎల్​బీసీ సొరంగం మార్గంలో 14వ కిలోమీటర్​ వద్ద పైకప్పు కూలింది. 13.5 కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు వెళ్లాయి. మరో అర కిలోమీటర్​ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఘటనాస్థలికి చేరుకునేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయి. 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్​లో ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు వెళ్లాయి. 11 కిలోమీటర్ల నుంచి 3 అడుగుల మేర వరకు నీరు నిలిచిపోయి ఉందని బృందాలు తెలిపాయి. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది నడుచుకొని వెళ్లారు. ఆ తర్వాత టన్నెల్​ బోరింగ్​ మిషన్​ వద్దకు ఎన్డీఆర్ఎఫ్​ బృందాలు చేరుకున్నాయి.

నీటి ఉద్ధృతికి 80 మీటర్లు వెనక్కి వచ్చిన టన్నెల్​ బోరింగ్ :నీటి ఉద్ధృతికి 80 మీటర్ల వెనక్కి టన్నెల్​ బోరింగ్​ మిషన్​ వచ్చిందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.. టీబీఎం వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్​ ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ 200 మీటర్ల గ్యాప్​లోనే 8 మంది చిక్కుకున్నారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. చిక్కుకున్న వారిని పిలుస్తూ స్పందన కోసం ఈ బృందాలు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెస్క్యూ బృందాలకు టీబీఎం వెనుక భాగం కనిపించింది. పైకప్పు కూలడంతో మట్టితో టీబీఎం కూరుకుపోయింది. టీబీఎంకు ముందు భాగంలో 8 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. ఇద్దరు ఇంజినీర్లు, టీబీఎం ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఇందులోనే చిక్కుకున్నారు.

ఎస్​ఎల్​బీసీ వద్దకు మంత్రులు ఉత్తమ్, జూపల్లి​ :మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావునిరంతరాయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి సైతం సొరంగంలోకి వెళ్లారు. సహాయక బృందాలు సొరంగ మార్గంలో దాదాపు 13.5కి.మీ లోపలికి వెళ్లాయి. అయితే, మరో అర కిలోమీటరు వెళ్లాల్సి ఉండగా.. కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి.

సీఎంకు రాహుల్​ గాంధీ ఫోన్​ : ఎస్​ఎల్​బీసీ ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డికి రాహుల్​ గాంధీ ఫోన్​ చేసి వివరాలు అడిగారు. సుమారు 20 నిమిషాలు మాట్లాడిన ఆయన, ప్రమాద వివరాలు, చేయాల్సిన సహాయక చర్యలపై చర్చించారు. ఘటన జరగ్గానే మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి ప్రమాద స్థలికి వెళ్లారని, రాష్ట్ర, కేంద్ర విపత్తు సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్​ చేస్తున్నాయని వివరించారు. క్షతగాత్రులకు వైద్య ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాట్లను రాహుల్​ అభినందించారు. టన్నెల్​లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలని సీఎం రేవంత్​కు సూచించారు.

ఎస్​ఎల్​బీసీ సొరంగ ప్రమాదం - 12 కి.మీ వరకే లోపలికి వెళ్లవచ్చు, ఆ తర్వాత కష్టమే!

సహాయక చర్యలపై ఆదివారం సాయంత్రం వరకు స్పష్టత వస్తుందన్న ఉత్తమ్ - రంగంలోకి ఆర్మీ ఇంజినీర్ టాస్క్​ఫోర్స్

ABOUT THE AUTHOR

...view details