HC Reserved Judgement on KCR Harish Rao Petition :మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనలో భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి నాసిరకమైన నిర్మాణంతో పాటు సరైన డిజైన్ లేకపోవడమే కారణమంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి భూపాలపల్లి లోయర్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని లోయర్ కోర్టు కొట్టివేయడంతో జిల్లా న్యాయస్థానంలో రాజలింగమూర్తి క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాజలింగమూర్తి పిటిషన్ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్రావుతో కలిపి ఆరుగురికి నోటీసులను జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టుకు పరిధి లేకున్నా పిటిషన్ను విచారణకు స్వీకరించిందని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గత విచారణ సందర్భంగా జిల్లా కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
ఇటీవలే హత్యకు గురైన రాజలింగమూర్తి : ఫిర్యాదుదారు రాజలింగమూర్తి గత వారం హత్యకు గురయ్యాడు. విచారణ సందర్భంగా ఈ విషయం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందిన తర్వాత ఇక ఆ పిటిషన్ను ఎలా విచారిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు మృతి చెందినా పిటిషన్ను విచారించొచ్చని వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును చదివి వినిపించారు. మేడిగడ్డ బ్యారేజీ వల్ల లక్షా 30వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పీపీ వాదించారు.