Huge investments for Telangana :ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. గత దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులను ఇప్పటికే అధిగమించాయి. ఇప్పటికే సుమారు రూ.62వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరగ్గా ఇవాళ మరిన్ని ఎంవోయూలు జరగనున్నాయి. బుధవారం సన్ పెట్రోకెమికల్స్, కంట్రోల ఎస్, జేఎస్డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి నాలుగు రోజుల దావోస్ పర్యటన నేటితో ముగియనుంది.
తెలంగాణలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడులు :దావోస్ వేదిక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. గతేడాది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సుమారు రూ.40వేల కోట్ల పెట్టుబడులు రాగా ఈ సారి ఇప్పటికే సుమారు రూ.62వేల కోట్ల వరకు వచ్చాయి. నిన్న రికార్డు స్థాయి పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ చేసుకుంది. భారీ పంప్ స్టోరేజీ జలవిద్యుత్తు, సోలార్విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. నాగర్కర్నూలు, మంచిర్యాల, ములుగుజిల్లాల్లో 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. వాటికి 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. ఆ ప్రాజెక్టుల నిర్మాణదశలోనే సుమారు 7వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దావోస్ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే.
గ్రీన్ ఎనర్జీకి ప్రధాన్యమిస్తున్నాం :సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపిన తర్వాత ఎంవోయూ జరిగింది. సుస్థిర ఇంధన వృద్ధి సాధించే లక్ష్య సాధనలో ఆ ఒప్పందం మైలు రాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను సీఎం అభినందించారు. భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం, సీఐఐ, హీరో మోటార్ కార్ప్ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అంతా సహకరించాలని కోరారు. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చేందుకు డ్రై పోర్టు ఏర్పాటు చేసి మచిలీపట్నానికి రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న కంట్రోల్ ఎస్ :రూ.10వేల కోట్ల పెట్టుబడికి సంబందించి రాష్ట్రప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. జేఎస్డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో రూ.800 కోట్లతో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి యూనిట్ ఏర్పాటు చేసేలా జేఎస్ డబ్యూ యూఏవీ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుతో సుమారు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది.