తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం - లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం - telangana heavy rains - TELANGANA HEAVY RAINS

Heavy Rains Lash in Telangana : రాష్ట్రంలో సోమవారం వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్​ మహానగరం రెండో రోజూ వర్షపు నీటిలోనే చిక్కుకుంది. తెలంగాణవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం మంచిర్యాల జిల్లాలో నమోదైంది.

Heavy Rains Lash in Telangana
Heavy Rains Lash in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 7:00 AM IST

Heavy Rains in Telangana : రాష్ట్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. సోమవారం ఏకధాటిగా కురిసిన వానకు పలు జిల్లాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్​ నగరం వరద నీటితో మునిగింది. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

డ్రైనేజీ రోడ్లపై ప్రవహించడంతో పలు కాలనీలు దుర్గంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు రోడ్లపై ప్రవహించి చెరువులను తలపించాయి. ఆదివారం కూడా వర్షపు నీటితో హైదరాబాద్​ తడిముద్ద అయింది. ఏకధాటిగా మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.

ఉమ్మడి వరంగల్​ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం : ఉమ్మడి వరంగల్​ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వరంగల్​, హనుమకొండ, కాజీపేట, నర్సంపేటలో పడిన వానకు రహదారులు జలమయమయ్యాయి. బస్టాండ్​లోనూ వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, రాఘువరెడ్డిపేట గ్రామాల మధ్య వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వాగు అవతలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

నీల్వాయిలో అత్యధిక వర్షపాతం : నిజామాబాద్​లో ఒక్కసారిగా కురిసిన వానకు రోడ్లలన్నీ జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని కోల్​బెల్ట్​ ప్రాంతమైన మందమర్రి, రామకృష్ణాపూర్​లో భారీ వర్షం పడింది. నిర్మల్​ జిల్లాలో గంటకుపైగా ఆగకుండా వర్షం పడింది. ఆదివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో 15.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

దక్షిణ ఒడిశా తీరం వద్ద అల్పపీడనం : దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సంబల్పూర్​-పూరి మధ్య రుతుపవన ద్రోణి కూడా ఏర్పడినట్లు పేర్కొంది. ఈ కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.

హైదరాబాద్​లో ఏకధాటిగా కురిసిన వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం - Rains in Hyderabad

పంజాగుట్ట పీవీఆర్ థియేటర్​లో వర్షం - అసహనం వ్యక్తం చేసిన ప్రేక్షకులు - Rain Drops in PVR Theatre

ABOUT THE AUTHOR

...view details