Water Sources in Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతేడాది వర్షాలు లేక చెరువులు, కుంటలు ఎండిపోయాయి. నాగార్జునసాగర్ జలాశయంలోనూ నీరు దగ్గడంతో భూగర్భజలాలు అడుగంటాయి. వేసిన పంటలను కాపాడుకునేందుకు ఒక్కొక్కరు 10 నుంచి 15 బోర్లు వేయించినా, చుక్కనీరు రాక రైతులు లక్షల్లో నష్టపోయారు. వానాకాలంలోనూ సరైన వర్షాలు పడలేదు.
జల నిపుణుల సంతృప్తి : ఇలాంటి కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం కోసం నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని సన్న, చిన్నకారు రైతులు కలిసి ఆరేళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో బావులు తవ్వించుకున్నారు. ప్రస్తుతం వీటిలో నీరు పుష్కలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ జల నిపుణుల బృంద సభ్యులు ఈ బావులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చుకున్నారంటూ అభినందించారు.
గతంలో సాగు చేసేందుకు ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేకుండాపోయిందని రైతులు చెబుతున్నారు. నీటివసతి లేక తోటలు పెట్టుకుంటే, అవి కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఆరేళ్ల క్రితం ఉపాధిహామీలో బావిని తవ్వించుకున్నామని, ప్రస్తుతం తమకు నీటి కష్టాలు దూరమయ్యాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామసభలో ఆమోదం :గతంలో 15 లక్షలు ఖర్చు చేసి 8 బావులు తవ్వించామని, అన్ని బావుల్లో ఐదారేళ్ల నుంచి నీరు పుష్కలంగా ఉంటుందని ఏపీవో రమణయ్య అన్నారు. సన్న, చిన్నకారు రైతులు ఉపాధిహామీలో ఈ బావులు తవ్వుకునే అవకాశం ఉందన్నారు. రైతులు దరఖాస్తులు చేసుకుంటే గ్రామసభ ఆమోదంతో బావులు మంజూరు చేస్తామన్నారు. కరవు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ చెరువులు, బావులు, కుంటలను నీటితో నింపుకోవాలని రైతులు చెబుతున్నారు.