Farmer Loan Waiver in Telangana : ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీని అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొన్ని రోజులుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆర్థిక శాఖ అధికారులు, మంత్రివర్గ సహచరులతో కలిసి ఈ అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. దీంతో రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
దీని ప్రకారం చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికీ, సంస్థలకు ఉన్న భూములకు, ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ ఎకౌంటెంట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారి భూములకు రుణమాఫీ అమలు ఉండదు. ఇలా వీరందరినీ తొలగించగా, ఇప్పుడు సుమారు 26 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు అంచనా.
మొదటగా లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ : ఇందుకు జులై మొదటి వారం నుంచే దశల వారీగా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మాఫీలో భాగంగా మొదటగా రూ.లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఇందుకు సుమారు రూ.6,000 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా. తర్వాత రూ.లక్షన్నర వరకు అమలు చేసే అవకాశం ఉండగా, దీనిలో రూ.6,500 కోట్లు అవసరమని సమాచారం. ఈ రెండు దశల్లోనే సుమారు రూ.16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ జరగనుంది. మిగిలిన రైతు కుటుంబాల్లో రూ.2 లక్షల వరకు ఉన్న వారికి తర్వాత రెండు దశల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. జులైలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టి రుణమాఫీకి నిధులు సమకూర్చే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.