Family Try To Die In Front Of The Siddipet Municipal Office :తమ ఇంటిని అకారణంగా కూల్చారంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం డీజిల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,
సిద్దిపేట పట్టణంలోని 12వార్డ్ కాళ్లకుంట కాలనీకి చెందిన పస్పునూరి నిర్మల కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అయితే గురువారం సిద్దిపేట మున్సిపల్ అధికారులు వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి గోడను కూల్చి వేశారు. ఇదే విషయమై బాధితులు పస్పునూరి నిర్మల, చంద్రం, స్వామి కీర్తన, పూర్ణ చంద్ర తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇంటిని ఎలా కూలుస్తారని మున్సిపల్ కార్యాలయం ఎదుట డీజిల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
న్యాయం జరిగే వరకూ పోరాడతాం :సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీజిల్ పోసుకున్న వారిపై నీరు పోసి రక్షించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, తమ ఇంటిని మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ యాదవ్ ఇంటి గోడను కూల్చి వేయించారని ఆరోపించారు. ఆయనకు ఇప్పటికే లక్ష రూపాయల డబ్బులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు కూల్చారని, ఇది మూడోసారి ఇంటి గోడను కూల్చడమని వాపోయారు. తాము ఇప్పటికీ ఇంటికి పన్నులు కడుతున్నామని అయినా కూల్చడం ఏంటని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని అన్నారు.