తెలంగాణ

telangana

'రోడ్డు వెయ్యండి బాబు' - ఉన్న రోడ్డును తవ్వేసి కంకర పోశారు - కొత్తది వేయడం మరిచారు - VILLAGE PEOPLE DEMAND FOR ROAD

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 9:55 AM IST

Updated : Apr 6, 2024, 3:33 PM IST

People facing Problems by Incomplete Road in Hanamkonda District : కొత్త రోడ్డు కోసం ఉన్న రోడ్డును తవ్వి, కంకర పోసి వదిలేశారు. నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి కాలేదు. రోజూ రాకపోకలు కొనసాగించే స్థానికులు, ప్రమాదాల బారినపడుతూ 'రోడ్డు వెయ్యండి బాబు' అంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. గ్రామానికి వేరే మార్గం లేకపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

People Demanding for New Road
People facing Problems by Incomplete Road in Hanamkonda District

'రోడ్డు పూర్తి చెయ్యండి సార్​ - అవస్థలతో పాటు ప్రమాదాలకు గురవుతున్నాం'

People facing problems by Incomplete Road in Hanamkonda District :హనుమకొండ జిల్లా పరకాల మండలంలో నాగారం తాటి వనం నుంచి వెంకటాపూర్, హైబోతుపల్లి మీదుగా భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం చింతలపల్లి వరకు నూతన బీటీ రోడ్డు మంజూరు చేశారు. సదరు గుత్తేదారు రోడ్డును తవ్వి కంకరపోసి వదిలేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డుపై నడవాలంటే నరకం చూస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు వేరే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'ఆరు నెలల క్రితం మంచిగా ఉన్న రోడ్డును తీసి, కంకర పోసి వదిలిపెట్టారు. దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించి సకాలంలో రోడ్డు పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నాం. రాత్రి వేళలో సరిగా కనిపించక స్లిప్​ అయ్యి చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో పాటు కంకర రాళ్ల వల్ల ఇప్పటికే చాలా మంది గాయపడ్డారు.'- స్థానికులు

People Demanding for New Road :నాగారం తాటివనం నుంచి చింతలపల్లి వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర కంకర పోసి అలానే వదిలేయడంతో నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. నిత్యావసరాల కోసం పరకాల వెళ్లాలంటే ఇదే ప్రధాన దారి అని, ఈ రోడ్డుపై ప్రయాణించిన చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు గుండా ప్రయాణించాలంటే నరకం చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

'రోడ్డుపై కంకర ఉండటం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. ఓ పెద్ద మనిషి కిందపడితే కాళ్లకు 18 కుట్లు పడ్డాయి. ఇద్దరు యువకులు కూడా కిందపడటం వల్ల తలకు దెబ్బలు తగిలాయి. దీని గురించి నాయకులను అడిగితే చూస్తాం అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. అత్యవసరంగా వెళ్లాలంటే ఈ రోడ్డుపై సాధ్యం కావడం లేదు. దీంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం.' - స్థానికులు

'నేను ఈ గ్రామంలో ఆర్​ఎంపీ డాక్టర్​ను. నా దగ్గరకు రోజు చాలా మంది రోడ్డుపై గాయపడి వస్తున్నారు. నాయకులు త్వరగా రోడ్డు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుని ఎవరూ ప్రమాదాలకు గురికాకుండా చూడాలి.' -ఆర్​ఎంపీ వైద్యుడు

నిలిచిపోయిన డివైడర్ విస్తరణ పనులు - ప్రజలకు తప్పని ఇబ్బందులు

పది రోజుల్లో ఇది రెండోసారి - కూకట్​పల్లిలో కుంగిన రోడ్డు

Last Updated : Apr 6, 2024, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details