తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కించుకోవాలి : సీఎం రేవంత్ ఆదేశం - CM REVIEW ON RIVER WATER PROJECTS

నీటిపారుదల ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి నదీజలాల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష - కృష్ణా - గోదావరి జలాలపై అంతర్ రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

CM Revanth Review On River Water Projects
CM Revanth Review On River Water Projects (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 7:49 PM IST

CM Revanth Review On River Water Projects :కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రైబ్యునల్ ఎదుట సమర్థ వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులకు స్పష్టం చేశారు.

నదీజలాల అంశంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష :నీటిపారుదల ప్రాజెక్టులు, నదీజలాల అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాండింగ్ కౌన్సిల్ వైద్యనాథన్, ఏజీ సుదర్శన్ రెడ్డి, అదనపు ఏజీ రజనీకాంత్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది ఖుష్ వోరా, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఉన్నతాధికారులు, ఈఎన్సీలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా - గోదావరి జలాలపై ఉన్న అంతర్ రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయించాల్సి ఉందని త్వరలోనే రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణా జలాలకు సంబంధించి ట్రైబ్యునల్ తీర్పులు, డీపీఆర్​ల గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాటి ఆధారంగా ట్రైబ్యునల్ ఎదుట పకడ్బందీగా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు.

కృష్ణా జలాల్లో 70 శాతం వాటా రాష్ట్రానికి దక్కేలా :అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం నదీ పరివాహక ప్రాంత దామాషా ప్రకారం నీటి కేటాయింపులు ఉండాలన్న రేవంత్ రెడ్డి కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా, ఏపీలో కేవలం 30 శాతం ఉందని అన్నారు. ఆ ప్రకారం 1005 టీఎంసీల కృష్ణా జలాల్లో 70 శాతం నీటివాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు వినియోగిస్తున్నందున, అందుకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీలు తెలంగాణకు నీటి కేటాయింపులు ఉన్నాయని ఆ వాటాను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

CM Review On River Water Projects :బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నీటి వాటాల పంపిణీ ఇప్పటి వరకు పూర్తి చేయనందున కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ట్రైబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే వరకు గోదావరి, కృష్ణా బోర్డుల జోక్యం ఉండకూడదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో కోటాకు మించి ఎక్కువ నీటిని ఆంధ్రప్రదేశ్ తరలిస్తోందని సమావేశంలో చర్చ జరిగింది. నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలీమెట్రీ పరికరాలకయ్యే 12 కోట్ల రూపాయలను రెండు రాష్ట్రాలు చెరో సగం చెల్లించాలని అధికారులు వివరించారు.

అవసరమైతే మొత్తం డబ్బులు ముందుగా భరించి టెలీమెట్రీ అమల్లోకి తీసుకురావాలన్న రేవంత్ రెడ్డి ఏపీ ఇచ్చినప్పుడు రీఎంబర్స్ చేసుకోవాలని సూచించారు. నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలని స్పష్టం చేశారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారన్న వివరాలన్నీ రికార్డు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించాలి :సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులు తీసుకోవాలని, పూర్తి ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరమైన పనులన్నీ త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటివరకు ఉన్న జీఓలు, తీర్పులతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీఓలు, మెమోలు, ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. వీటి ఆధారంగా అన్ని వేదికలపై తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేలా సమర్థమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

KRMB Three Member Committee Meeting : కృష్ణా జలాలు సాగుకు వద్దు.. తాగునీటి అవసరాలకే వినియోగించాలి: త్రిసభ్య కమిటీ

కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్​కు నీటి తరలింపు - అధికారులకు సీఎం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details