తెలంగాణ

telangana

కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది : హరీశ్​రావు - Harish Rao Slams Congress Govt

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 10:06 PM IST

BRS Senior Leader Harish Rao On Education Dept : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై విపరీత నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. అందుకు నిదర్శనమే నేటి బాసర ట్రిపుల్​ ఐటీ ఉదంతమని ఎక్స్​ వేదికగా విరుచుకుపడ్డారు. మరోవైపు గురుకుల విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.

Harish Rao Slams Congress Govt
BRS Senior Leader Harish Rao On Education Dept (ETV Bharat)

Harish Rao Slams Congress Govt : కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందనడానికి బాసర ట్రిపుల్ ఐటీ ఉదంతం మరో నిదర్శనమని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని ఒకవైపు గురుకుల విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

పూర్తి స్థాయి వీసీ నియామకం, నిధుల గోల్ మాల్, మెస్ కాంట్రాక్టులలో పారదర్శకత, సిబ్బంది నియామకాలు, ఆరోగ్య సేవల మెరుగుదల, మౌలిక సదుపాయాల పెంపు, తదితర 17 డిమాండ్లతో విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆయన ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రచారం కోసం ట్రాక్టర్​లో వెళ్లి, కళాశాల గోడ దూకి నానాయాగి చేశారని గుర్తు చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకం :కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని భ్రమింపజేశారని హరీశ్​రావు తెలిపారు. ముఖ్యమంత్రి అయి రేవంత్ రెడ్డి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు కానీ, విద్యార్థుల భవిష్యత్తును మాత్రం ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. గతంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీకి వెళ్లి సమస్యలు పరిష్కరించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసిన కృషిని కూడా కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. అందువల్లే ఇవాళ సమస్యలు పేరుకుపోయాయని మాజీమంత్రి ఆరోపించారు.

కొత్త వాటి ఊసు లేదు - ఉన్నదానికి దిక్కులేదు :రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారని, అప్పుడు గోడలు దూకి వెళ్లారు కదా, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. ఏమైంది రేవంత్ రెడ్డి అని హరీశ్​రావు ప్రశ్నించారు. కొత్త వాటి ఊసు లేదు, ఉన్నదానికి దిక్కులేదని ఎద్దేవా చేశారు.

ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నతమైన ట్రిపుల్ ఐటీ వరకు 9 నెలల పాలనలో ధ్వంసం కాని విద్యావ్యవస్థ ఇంకేమైనా ఉందా అని అడిగారు. టీచర్లు లేక 1800 పాఠశాలలు మూతపడ్డాయని, కల్తీ ఆహరంతో ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోయాయని అన్నారు. 600 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలు కాగా 40 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల నిలయంగా విద్యాలయాలు మారిపోయాయని తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించాలని, విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించాలని హరీశ్​రావు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

'కాంగ్రెస్​కు రాజకీయ కక్ష సాధింపులు ఉంటే మాపై తీర్చుకోవాలి, విద్యార్థులపై కాదు' - BRS On Gurukul Students Protest

కాంగ్రెస్​ పాలనలో రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి : హరీశ్​రావు - harish rao fires on congress govt

ABOUT THE AUTHOR

...view details