BRS Ex MLA Kandala Upender On Amrut Tender Issue :కేంద్ర ప్రభుత్వ ‘అమృత్’ పథకం టెండర్ల విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఎవరో తప్పుదోవ పట్టించారని, ఆ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేటీఆర్కు అన్ని విషయాలు వివరిస్తాను, వాస్తవాలు చెబుతానని తెలిపారు. రాజకీయాలకు, వ్యాపారానికి సంబంధం లేదన్న ఆయన, పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో లబ్ది పొందిన వారే ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉన్నారని తీవ్రంగా ఆరోపించారు.
అదేవిధంగా వ్యాపారంలో జాయింట్ వెంచర్లు సహజమన్న ఉపేందర్, అమృత్ టెండర్లలోనూ అదే జరిగిందని ఉద్ఘాటించారు. అమృత్ టెండర్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేదని తెలిపారు. ఈ విషయంలో కేటీఆర్తో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. అనవసర రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. తన అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా : రేవంత్ రెడ్డి చిన్న మామ కుమారుడు సృజన్ రెడ్డి అని, అర్హత లేదు కాబట్టే జాయింట్ వెంచర్కు వెళ్లారని వివరించారు. టెండర్లకు, ముఖ్యమంత్రికి ఏం సంబంధమని ప్రశ్నించిన కందాల, రాజకీయాల్లో ఎన్నో మాట్లాడుతుంటారని కొట్టిపడేశారు. మంత్రి పొంగులేటిపై కూడా ఎన్నో వచ్చాయని, అయినా తాను ఏమీ మాట్లాడలేదని అన్నారు. వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చని, రాజకీయాలతో సంబంధం లేదని వివరించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సీవీసీకి ఫిర్యాదు చేసుకోవచ్చన్న ఆయన, తన వ్యాపారానికి రాజకీయాలను ఎప్పుడూ వాడుకోలేదని అన్నారు. మరోవైపు సృజన్ రెడ్డి తండ్రి మనోహర్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు.