Bhatti Vikramarka Review Meet on Strengthening Trans-Co:రాష్ట్ర ప్రజలకు రాబోయే ఏడు సంవత్సరాలకు కావలసిన విద్యుత్తు సరఫరా చేయడానికి కావలసిన ప్రణాళికను రూపొందించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు నిర్దేశం చేశారు. సోమవారం డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్ -కో సంస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం 15,700 మెగావాట్ల విద్యుత్తు పీక్ డిమాండ్ ఉన్నదని, రాబోయే ఏడు సంవత్సరాలకు 27వేల మెగా వాట్లకు పీక్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ఆ అంచనాకు అనుగుణంగా విద్యుత్తును సరఫరా చేయడానికి కావలసిన ప్రణాళికలను రూపొందించుకొని కార్యాచరణను వెంటనే అమలు చేయాలని అన్నారు.
ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంపై అవగాహన :ట్రాన్స్-కో ఆధ్వర్యంలో చేపడుతున్న సబ్ స్టేషన్ల నిర్మాణ పనులపై ఆరా తీశారు. సబ్ స్టేషన్ల పనుల నిర్మాణానికి నిర్ణీత గడువు లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలని సూచించారు. ఈ సంవత్సరం, రాబోయే రెండు సంవత్సరాల్లో సంస్థ పరంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. డైరెక్టర్ నుంచి ఏఈ వరకు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకొని సంస్థలు బలోపేతం చేసుకోవాలని సూచించారు.