తెలంగాణ

telangana

ETV Bharat / state

'వారిని విధుల్లోకి తీసుకోండి.. లేదంటే మమ్మల్ని సస్పెండ్​ చేయండి' - ఆగని ఖాకీల ఆందోళనలు

ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్‌ నినాదంతో ఆగని ఖాకీల నిరసన - సస్పెండ్‌ చేసిన ఆరుగురిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌

Battalion Police Protest in Rajanna Siricilla
Battalion Police Protest in Rajanna Siricilla (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Battalion Police Protest in Rajanna Siricilla : 'ఒకే పోలీస్- ఒకే రాష్ట్రం' నినాదంతో బెటాలియన్‌ కానిస్టేబుళ్లు చేపట్టిన ఆందోళనలు ఆగడంలేదు. నాలుగైదు రోజులుగా నిరసనలు చేస్తున్న తోటి ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం సరికాదంటూ మరోమారు ఖాకీలు రోడెక్కారు. నిర్ణీత సమయం లేని విధుల వల్ల కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతున్నామంటూ ర్యాలీ నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కార్యాలయాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

ఏక్‌ స్టేట్‌- ఏక్‌ పోలీస్‌ అనే నినాదంతో కొద్ది రోజులుగా బెటాలియన్‌ కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తున్నారు. నిర్ణీత పరిధి లేని విధుల వల్ల కుటుంబంతో సమయం గడపలేకపోతున్నామని రోడెక్కి నిరసన తెలిపారు. సిరిసిల్ల పట్టణం సర్దాపూర్‌లోని 17వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. అనంతరం కమాండెంట్ శ్రీనివాసరావు ఛాంబర్ వద్ద బైఠాయించి కమాండెంట్ పాలన వద్దంటూ నినాదాలు చేశారు. మీడియాతో మాట్లాడినందుకు సస్పెండ్ చేసిన ఆరుగురు కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేదంటే, ఆందోళనలో పాల్గొన్న 200 మందిని సైతం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ నిరసన : వరంగల్ జిల్లా మామునూరులో టీజీఎస్పీ 4వ బెటాలియన్‌లోనూ కానిస్టేబుళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేశారని పలువురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదన్నారు. సస్పెన్షన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని మామునూరు 4వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. నల్గొండలోని అన్నెపర్తి 12 వ పటాలంలోనూ ఆరుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఖాకీలు ఆందోళన చేపట్టారు. బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి 7వ బెటాలియన్ కానిస్టేబుల్స్, డిప్యూటీ కమాండెంట్‌ ఎమ్​వై సురేశ్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

టీజీఎస్పీ సిబ్బంది కుటుంబాలకు డీజీపీ సూచన :మరోవైపు తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. పోలీసుల కుటుంబాలు రహదారులపైకి వచ్చి ధర్నాలు చేయడం సరికాదన్నారు. ఆందోళనలు విరమించి సమస్యలుంటే విన్నవించాలని ఆయన శనివారం ఓ ప్రకటనలో సూచించారు. ఆ సమస్యలను సానుకూల దృక్పథంతో, సానుభూతితో పరిశీలించి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూనిఫాం బలగాల్లో క్రమశిక్షణరాహిత్యం తీవ్రమైన విషయమని, ఆందోళనలు విరమించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

యాక్షన్ తప్పదు - ఆందోళనకు దిగిన బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు డీజీపీ జితేందర్​ వార్నింగ్

రోడ్డెక్కిన పోలీసుల భార్యలు - సచివాలయం ముట్టడికి యత్నం

ABOUT THE AUTHOR

...view details