తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాకు షేర్ ఇవ్వండి - లేదా పోటీ నుంచి తప్పుకోండి' - Wine Shop Tenders 2024

మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దంటూ వ్యాపారుల్ని హెచ్చరిస్తున్న కొందరు ఏపీ ఎమ్మెల్యేలు - తమను కాదని దరఖాస్తు చేస్తే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులు - సర్కార్ ఆదాయానికి గండికొట్టేలా నేతల తీరు.

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 40 minutes ago

AP NEW WINE TENDER POLICY
AP Leaders on Wine Shop Tenders (ETV Bharat)

AP Leaders on Wine Shop Tenders : ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సర్కార్ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని మద్యం వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొందరైతే తాము రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని, అయినా తమకు వాటా ఇవ్వాలని, దానికి అంగీకరిస్తేనే అర్జీ చేసుకోవచ్చని అంటున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు నేరుగానే మద్యం వ్యాపారులకు ఆదేశాలిస్తున్నారు. మరికొందరు తమ ప్రధాన అనుచరులతో చెప్పిస్తున్నారు. తమను కాదని ఎవరైనా దరఖాస్తు చేస్తే ఆ తర్వాత వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో మద్యం దుకాణాల లైసెన్సులకు ఆశించిన స్థాయిలో అర్జీలు రావడం లేదు.

961 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ రాలేదు : ఆంధ్రప్రదేశ్​లోని 961 మద్యం దుకాణాలకు ఇప్పటివరకూ ఒక్క అర్జీ కూడా రాలేదు. అత్యధికంగా తిరుపతి జిల్లాలోని 133 దుకాణాలకు దరఖాస్తులేవీ రాలేదు. నెల్లూరులో 84, కాకినాడలో 58, ప్రకాశంలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 60, విశాఖపట్నంలో 60 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ రాలేదు.

ఒడిశా సరిహద్దుల్లో దరఖాస్తులు వేయొద్దని హుకుం :

  • శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దుల్లోని ఓ నియోజకవర్గంలోని దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దని కీలక నాయకుడి తరఫున మద్యం వ్యాపారులకు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే తండ్రి దుకాణాలన్నింటికీ దరఖాస్తులు వేస్తారని ఆయనకే అవి వదిలేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తమ కోసమే ఈ పాలసీ వచ్చిందని బహిరంగంగానే చెబుతున్నారు.
  • శ్రీకాకుళం జిల్లాలోని రెండు నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధులు ఇటీవల విశాఖపట్నంలో మద్యం వ్యాపారులతో భేటీ అయ్యారు. వారి నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాల కోసం ఎవరూ దరఖాస్తు వేయొద్దని హెచ్చరించారు. ఇదే జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్న మరో కీలక నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు కొన్ని దుకాణాలను తమకు వదిలేసి మిగతా వాటికే దరఖాస్తులు చేసుకోవాలని మద్యం వ్యాపారులకు చెప్పారు.
  • పల్నాడు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక్కో షాప్​కి ఇంత చొప్పున తమకు సొమ్ము చెల్లించాలని, తర్వాత దుకాణంలో వాటా ఇవ్వాలని ముఖ్యనేత కుమారుడు చెబుతున్నట్లు తెలుస్తోంది.
  • గుంటూరుకు సమీపంలోని ఓ నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
  • గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో మూడు నియోజకవర్గాలు మినహా మిగతా అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే ఉంది.

విజయవాడ సమీపంలోనూ : విజయవాడ సమీపంలోని రెండు నియోజకవర్గాల్లో, నగరంలోని మరో నియోజకవర్గంలో, కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో క్యాసినోలకు గుర్తింపు పొందిన ఓ నియోజకవర్గంలో, ఏలూరు జిల్లాలోని ఇంకో నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు అక్కడ ముఖ్య నాయకులు అనుమతించినవారు మినహా వేరెవరూ దరఖాస్తు చేయడానికి వీల్లేదనే అనధికారిక ఆదేశాలు అమలవుతున్నాయి. దీంతో అక్కడ పెద్దసంఖ్యలో దరఖాస్తులు దాఖలవ్వాల్సి ఉన్నా, పడట్లేదు.

అనంతపురం జిల్లాలోని ఓ ప్రధాన నియోజకవర్గ ముఖ్యనేత అక్కడి దుకాణాలకు ఎవరూ అర్జీ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. తనను కాదని దరఖాస్తులు వేస్తే, తర్వాత వ్యాపారం ఎలా సాగుతుందో చూస్తానని హెచ్చరిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో చిత్తూరు సరిహద్దుల్లో ఉన్న ఓ నియోజకవర్గంలో కీలక నాయకుడికి సంబంధించిన వ్యక్తులు తప్ప వేరెవరూ దరఖాస్తులు వేయట్లేదు. నంద్యాల, వైఎస్సార్, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

విజయనగరంలో అత్యధికం :విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేశారు. వాటిల్లో 5 మినహా మిగతా వాటికి ఏపీలోనే అత్యధికంగా 855 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరు జిల్లాలో 144 దుకాణాలు నోటిఫై చేయగా ఇప్పటివరకూ 706 అర్జీలు అందాయి. 16 దుకాణాలకు మాత్రం ఒక్క దరఖాస్తూ రాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 113 దుకాణాలు నోటిఫై చేయగా 613 అర్జీలు వచ్చాయి.

ఇప్పటికి వచ్చినవి 8,274 దరఖాస్తులే : ఏపీలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీ కోసం సర్కార్​ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒక్కో దుకాణానికి సగటున 30 చొప్పున దాదాపు లక్షకు పైగా దరఖాస్తులు వస్తాయని, నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందన్నది ప్రభుత్వ అంచనా. దరఖాస్తులు ఆహ్వానించి ఆరు రోజులు గడిచిపోయాయి.

కానీ ఇప్పటివరకూ 8274 దరఖాస్తులతో రూ.165.48 కోట్ల ఆదాయమే వచ్చింది. అర్జీల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. ఎక్సైజ్‌ అధికారుల అంచనా ప్రకారం ఈ పాటికే 30 వేలకు పైగా దరఖాస్తులు రావాలి. కానీ కొందరు నేతల తీరు వల్ల అవి రావట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఇలాంటి పరిస్థితే ఉంది.

Last Updated : 40 minutes ago

ABOUT THE AUTHOR

...view details