Border Gavaskar Trophy South Africa Series Ruturaj Gaikwad : భారత జట్టును సోషల్ మీడియా నిర్ణయించదని, టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా జట్ల ఎంపికపై నెట్టింట్లో తీవ్ర చర్చ సాగుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20లు, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ల కోసం జట్టులను ప్రకటించింది బీసీసీఐ.
ఈ జట్టులో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్, మహ్మద్ షమీ, శివమ్ దూబెకు అవకాశం రాలేదు. గాయాల వల్ల వీరిని పక్కన పెట్టినట్లు తెలిసింది. పేస్ ఆల్రౌండర్గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోవడం విశేషం.
అయితే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు నాయకత్వం వహించే రుతురాజ్ గైక్వాడ్కు మాత్రం చోటు దక్కకపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, సెలక్టర్ల తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారిపై మండిపడుతున్నారు.
ఆస్ట్రేలియా - Aతో తలపడేందుకు సిద్ధమైన భారత్ - A జట్టుకు రుతురాజ్ నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రధాన జట్టులో ఎందుకు చోటు కల్పించలేదు? బ్యాకప్ ఓపెనర్గా అభిమన్యు ఈశ్వరన్ను తీసుకున్నప్పుడు రుతురాజ్ కనిపించలేదా? అని అభిమానులు ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతున్నారు.