Ind vs Eng 1st T20: స్వదేశంలో ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 12.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. అభిషేక్ శర్మ (79 పరుగులు, 34 బంతుల్లో; 5x4, 8x6) సూపర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు. తాజా విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1- 0తో ఆధిక్యం సాధించింది.
స్వల్ప లక్ష్య ఛేదనను భారత్ ఘనంగా ఆరంభించింది. సంజూ శాంసన్ (26 పరుగులు), అభిషేక్ శర్మ తొలి ఓవర్ నుంచే హిట్టింగ్ చేశారు. దీంతో 4 ఓవర్లలోనే స్కోర్ 40 దాటింది. శాంసన్ దూకుడుగా ఆడే క్రమంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ సూర్యకుమార్ (0) డకౌట్ అయ్యాడు. ఈ దశలో ఇంగ్లాండ్కు మరో ఛాన్స్ ఇవ్వకుండా అభిషేక్ బౌండరీలతో రెచ్చిపోయాడు. ఏకంగా 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఏకంగా 7 సిక్స్లతో విధ్వంసం సృష్టించాడు. విజయం ముంగిట అభిషేక్ ఔటయ్యాడు. చివర్లో తిలక్ వర్మ (19 పరుగులు), హార్దిక్ (3 పరుగులు) మ్యాచ్ పూర్తి చేశారు.