Magha Purana Chapter 25 : పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో 25వ అధ్యాయంలో వీరవ్రతుడు విశ్రుంఖలునికి పాపాలకు ఏ విధమైన ప్రాయశ్చిత్తం చెప్పాడో గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షితో, ఓ జహ్నువూ! విశ్రుంఖలుని వృత్తాంతం దివ్యదృష్టితో చూసిన వీరవ్రతుడు ఈ విధంగా పలికాడు అని చెబుతూ 25వ అధ్యాయాన్ని మొదలు పెట్టాడు.
విశ్రుంఖలుని దోషాలు వివరించిన వీరవ్రతుడు
వీరవ్రతుడు విశ్రుంఖలునితో "ఓరీ! విశృంఖలా! విప్రాధామా! నీవు చేసిన పాపాలు వివరించి చెబుతాను వినుము. నీ యజమాని కిరాతుడు కనికరం లేనివాడు. అమిత క్రూరుడు. జంతువులను పట్టి చంపేవాడు. అరణ్యంలో దారి కాచి బాటసారుల నుంచి ధనం, బంగారం దోచుకునేవాడు. వీడికి ఒక కంసాలి మిత్రుడు కలదు. వాడు మోసం చేయడంలో దిట్ట. ఇతరుల బంగారం దొంగిలించేవాడు. వీరిద్దరికి ఒక శూద్రుడు మిత్రుడు. వీడు పరమ ఘాతకుడు. కామానికి వశుడై వావి వరుస లేకుండా జంతువులా సంచరిస్తూ చేయరాని పాపాలు అనేకం చేశాడు. ఇటువంటి వారితో కలిసి మెలిసి తిరుగుతూ, వారితో కలిసి తింటూ, నిద్రిస్తూ, వారిచ్చే ధనంతో జీవించడం వలన నీ బ్రాహ్మణత్వం నశించింది. బ్రాహ్మణ జన్మ ఎత్తిన వారు పాపులకు దూరంగా ఉండాలి. వారితో మాట్లాడకూడదు, స్నేహం చేయకూడదు. తప్పనిసరై మాట్లాడవలసి వస్తే శిరస్సున దర్భలు ఉంచుకొని మాట్లాడితే వారి పాతకాలు అంటవు. నీవు స్నేహం చేసిన ముగ్గురు కూడా పంచ మహాపాతకాలు చేసినవారు. అందుకే నీతో కూడా మాట్లాడకూడదు" అని వీరవ్రతుడు మౌనం వహించాడు.
భయంతో ప్రాయశ్చిత్తం కోరిన విశ్రుంఖలుడు
వీరవ్రతుని మాటలు విన్న విశ్రుంఖలుడు భయకంపితుడై పశ్చాత్తాపం పొంది వీరవ్రతునితో "ఓ మహానుభావా! నా అజ్ఞానాన్ని మన్నింపుము. సమస్త పాపక్షయకరమగు ప్రాయశ్చిత్త కర్మను నా చేత చేయించి నన్ను పునీతుని గావింపుము అని పరిపరి విధాలుగా ప్రార్థించెను.
విశ్రుంఖలునికి ప్రాయశ్చిత్త కర్మను బోధించిన వీరవ్రతుడు
విశ్రుంఖలుని ప్రార్థనకు కరిగిపోయిన వీరవ్రతుడు ఎంతో దయతో "విశృంఖలా! జాగ్రత్తగా వినుము. ఈనాటి నుంచి 12 సంవత్సరాల పాటు నిరంతరం నీవు చేసిన పాపాలను తలచుకుంటూ గ్రామసంచారం చేస్తూ, ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేసి భిక్ష భోజనం మాత్రమే స్వీకరించాలి. ప్రతి సంవత్సరం మాఘ మాసం నెల రోజులపాటు ప్రయాగలో త్రివేణి సంగంలో స్నానం చేస్తూ, శ్రీహరిని పూజిస్తూ, ఆవు పిడకల మీద అన్నం వండుకుని తింటూ కాలక్షేపం చేయాలి. ఈ వ్రతం 12 ఏళ్ల పాటు చేసిన తరువాత నీవు పవిత్రుడవు కాగలవు. బ్రాహ్మణులూ జన్మతః పవిత్రులు. కానీ అజ్ఞానంతో చేసిన పాపాలు పోవడానికి ప్రయాగలో స్నానం చేయడం తప్పనిసరి. నేను చెప్పినట్లుగా చేస్తే నీ పాపాలు ప్రక్షాళన అవుతాయి" అని వీరవ్రతుడు విశ్రుంఖలునికి ప్రాయశ్ఛిత్త కర్మను ఉపదేశిస్తాడు.