తెలంగాణ

telangana

ETV Bharat / politics

కేసీఆర్​ ఒక సీజనల్​ రాజకీయవేత్త - బీఆర్​ఎస్​ అధినేత వ్యాఖ్యలపై కాంగ్రెస్​ స్ట్రాంగ్​ కౌంటర్ - CONGRESS LEADERS COUNTER TO KCR

కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోయిందని కేసీఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు - బీఆర్ఎస్ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలంటూ హితవు

Congress Leaders Comments
Congress Leaders Comments On KCR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2025, 7:20 AM IST

Congress Leaders Comments On KCR: ప్రభుత్వ పాలనపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌ మండిపడింది. కాంగ్రెస్ ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేక పోతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వంపై అసహనంతోనే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఎవరైనా ఏడాదిగా ఫాంహౌస్‌లో ఉంటారా అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ పాస్‌పోర్ట్‌ కోసమే బయటకొచ్చారని ఆరోపించారు. కేసీఆర్‌ ఒక సీజనల్‌ రాజకీయవేత్త అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు. తిరిగి అధికారంలోకి వ‌స్తారని కేసీఆర్ ప‌గ‌టిక‌ల‌లు కంటున్నారని విమర్శించారు.

కేసీఆర్ త‌న భ‌విష్యత్తు :14 నెల‌ల నుంచి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి అభివృద్ధి ఎలా క‌న‌బ‌డుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ భ‌విష్యత్ గురించి కాకుండా ముందుగా కేసీఆర్ త‌న భ‌విష్యత్తు, పార్టీ భ‌విష్యత్‌ గురించి ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ప్రజలు కర్రు కాల్చివాత పెట్టిన విషయం మరిచిపోయి కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోయిందని కేసీఆర్‌ వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సిల్వర్ జూబ్లీ మీద ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదని ఆరోపించారు.

బీఆర్​ఎస్​ను ముంచింది : బీజేపీతో రాజకీయ ఒప్పందమే బీఆర్​ఎస్​ను ముంచిందని, భవిష్యత్‌లో ముంచబోతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ జోస్యం చెప్పారు. కేసీఆర్, బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మునిగిపోతున్న బీఆర్ఎస్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు. ఫాంహౌస్‌ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటున్నాడని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ : కాంగ్రెస్ గ్రాఫ్ గురించి కేసీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్‌కు ప్రజా సమస్యలపై మాట్లాడే నైతికహక్కు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ గురించి కేసీఆర్​ ఆలోచిస్తే బాగుంటుందని నేతలు హితవు పలికారు.

"ప్రజలు తిరస్కరించినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కేసీఆర్ ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చావా? ప్రజల గురించి ఎన్నడూ పట్టించుకోని తాను కాంగ్రెస్ గురించి మాట్లాడతే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.కేసీఆర్‌కు ప్రజా సమస్యలపై మాట్లాడే నైతికహక్కు లేదు. కాంగ్రెస్ గ్రాఫ్ గురించి మాట్లాడే ముందు కేసీఆర్ బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది." -మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు

ప్రజలకు నచ్చి కాంగ్రెస్ గెలవలేదు - మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తాం : కేసీఆర్‌

కాంగ్రెస్ వద్దంటోంది, బీఆర్ఎస్ కావాలంటోంది - బీజేపీ మాత్రం నో కామెంట్

ABOUT THE AUTHOR

...view details