Yadagirigutta Narasimha Swamy : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ విమాన గోపురం స్వర్ణమయంగా మారింది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ముగిశాయి. రేపు (ఆదివారం) ఆలయ సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం ఘట్టం నిర్వహించి బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇవ్వనున్నారు.
విమాన గోపురానికి బంగారు తాపడం : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అనేక మంది భక్తులు, దాతలు విరాళాలు ఇచ్చినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు. ఆ తర్వాత 2022 మార్చి 8న కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధిపై దృష్టి సారించారు. పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్రెడ్డితో సమీక్షలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా : ఆదివారం ఉదయం 11.54 గంటలకు జరిగే మహత్తరమైన ఘట్టానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో కలిసిన అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. మార్చి 1 నుంచి 11 వరకు జరిగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులను ఆలయ పూజారులు ఆహ్వానించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా : దేశంలో ఎక్కడ లేని విధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురం 50.5 ఫీట్ల ఎత్తులో సుమారు 10,759 ఎస్ఎఫ్టీలుగా ఉంది. బంగారు తాపడం కోసం ఒక్కో ఎస్ఎఫ్టీకి 6 గ్రాముల చొప్పున మొత్తం 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఇందుకోసం సుమారు రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేశారు.
తాపడం కోసం విరాళాలుగా వచ్చిన బంగారం, నగదుతో పాటు స్వామి వారి హుండీ ఆదాయం నుంచి ఈ డబ్బులను ఖర్చు చేశారు. దీంతో పనులు వేగం పుంజుకున్నాయి. పనులు జరిగే గోపురం వద్దకు ఎవరిని అనుమతించ లేదు. సీసీ కెమెరాల పటిష్ఠ బందోబస్తు మధ్య పనులు జరిగాయి. గతేడాది నవంబర్లో తాపడం పనులను ప్రారంభించి ఈ నెల 10 తేదిన పూర్తిచేశారు.
బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి : యాదగిరీశుడి విమాన గోపురం స్వర్ణతాపడం పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లు తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ అన్నారు. స్వర్ణ తాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల కోసం పదకొండు వందల కిలోల రాగిని వినియోగించినట్లు చెప్పారు. దేశంలో ఈ తరహా విమాన గోపురం ఎక్కడ లేదని చెప్పారు. రేపు జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంతో బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయడానికి ఆలయ సిబ్బంది సర్వం సిద్ధం చేస్తున్నారు.
స్వర్ణ విమానం గోపురం విశేషాలివీ :
- స్వర్ణ విమాన గోపురం ఎత్తు: 50.5 అడుగులు
- బంగారు విమాన గోపురం వైశాల్యం : 10,759 చదరపు అడుగులు
- ఉపయోగించిన మొత్తం బంగారం: 68 కిలోలు
- తాపడం పనులు ప్రారంభించిన తేదీ: డిసెంబరు 1, 2024
- తాపడం కవచాల బిగింపు పనుల పూర్తి: ఫిబ్రవరి 18, 2025
- బంగారు తాపడం బిగింపు ఖర్చు: రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా)
- రాగిరేకుల తయారీ ఖర్చు: రూ.12 లక్షలు
- పనిచేసిన కార్మికులు: 50 మంది
- పనులు చేసిన సంస్థ: నవయుగ మెటల్స్
- స్వర్ణ విమాన గోపురం పనులు చేసిన సంస్థ: ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్, చెన్నై
టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు