ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

అసభ్య పదజాలానికి వైఎస్సార్సీపీ మారు పేరు - బూతులు ఆ పార్టీ నేతల పేటెంట్​ : చంద్రబాబు

ఈవీఎంలపై చెత్త మాటలు మాట్లాడటానికి జగన్​కు సిగ్గుండాలన్న సీఎం చంద్రబాబు - జగనే రాష్ట్రానికి అతి పెద్ద అరిష్టమంటూ ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

chandrababu_fires_on_jagan
chandrababu_fires_on_jagan (ETV Bharat)

CM Chandrababu Fires on Jagan for Talking about EVMs:ఈవీఎంలపై చెత్త మాటలు మాట్లాడటానికి జగన్​కు సిగ్గుండాలని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి జగన్ అతి పెద్ద అరిష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్య పదజాలానికి మారు పేరుగా వైఎస్సార్సీపీ మారితే, బూతుల్ని పేటెంట్​గా ఆ పార్టీ నేతలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు జరుగుతున్న నష్టంపై ఒక్కసారి కూడా నోరుమెదపని వారు ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారా అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకూడదని, అదే సమయంలో నష్టాలకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం చంద్రబాబు కోరారు.

కేంద్ర పథకాలను త్వరితగతిన అందిపుచ్చుకుంటూ వెళ్తే రాష్ట్రానికి జరిగిన నష్టం నుంచి వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ నంబర్ 1గా ఎదుగుతామని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుండటం మంచి పరిణామం కాదని ఆయన హితవుపలికారు. ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయాలని కుట్రపన్నిన వాళ్లు వరదల్లో తమ పనితీరును విమర్శిస్తారా అని మండిపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి రూ.400 కోట్ల పైన విరాళాలు ఇచ్చారని సీఎం తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా ఉత్సవాలు ఇంత కన్నులపండువగా గత 5ఏళ్లలో ఎప్పుడైనా జరిగాయా ప్రశ్నించారు. ప్రసాదాలు మొదలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. తమకు ఎవరి వల్ల లాభం జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తే అది సుస్థిర ప్రభుత్వానికి నాంది పలుకుతుందని చంద్రబాబు తెలిపారు.

రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత 5ఏళ్లలో జగన్​ వల్ల జరిగిన నష్టమే ఎక్కువ అని సీఎం మండిపడ్డారు. ఎవరి పరిపాలన వల్ల మంచి జరుగుతుందో, విజన్ వల్ల కలిగే లాభాల పట్ల ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో రూ.75 వేల కోట్లను రైల్వే మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తున్నారని వివరించారు. దక్షిణ భారత దేశంలో బెంగుళూరు- చెన్నై, అమరావతి-హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను కలిపేలా బులెట్ ట్రైన్ తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు బుద్ధి చెప్పినా, ప్రజా చైతన్యం ఎంతో అవసరమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వరద సాయంపై చర్చించేందుకు వైఎస్సార్​సీపీ నేతలు సిద్ధమా? : మంత్రులు

హర్యానాలో బీజేపీ విజయం ఎన్డీయేకు శుభసూచకం - జమిలి ఎన్నికలతో దేశానికి మేలు : సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details