తెలంగాణ

telangana

విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన విద్యుత్‌ తెలంగాణకు దక్కలేదు : జగదీశ్‌ రెడ్డి - jagadish reddy comments on congress

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 3:47 PM IST

Updated : Jun 29, 2024, 5:04 PM IST

Jagadish Reddy Fires on Congress Govt : తెలంగాణ విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్‌ దక్కలేదని ఆవేదన చెందారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Jagadish Reddy Fires on Congress Govt
Jagadish Reddy Fires on Congress Govt (ETV Bharat)

BRS MLA Jagadish Reddy on Telangana Electricity : విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్‌ దక్కలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. సీలేరు విద్యుత్‌ ప్లాంట్‌ కోసం 7 మండలాలను ఏపీలో కలుపుతున్నారన్నారు. ప్రైవేటు కంపెనీల నుంచి కూడా విద్యుత్‌ కొనకుండా తెలంగాణపై కుట్రలు చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు తనకు తెలిసిన సమాచారాన్ని పంపామని, గత ప్రభుత్వంపై అర్థం లేని రాజకీయ ఆరోపణలు కొందరు చేశారని వాటికి సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి తెలిపారు. కమిషన్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపానని అన్నారు. కొందరు కుహన మేధావులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్‌, అప్పటి ప్రభుత్వంపై బురద జల్లుదామని, అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు చేసే కుట్ర అది అని ధ్వజమెత్తారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎక్కువ ధరకు కాకుండా రూ.3.90కి యూనిట్‌ కరెంటు కొంటే నష్టం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కమిషన్‌ దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లానని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో విద్యుత్‌ విషయంలో పక్క రాష్ట్రం ఎన్నో కుట్రలు చేసిందని చెప్పారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా పీజీసీఎల్‌ లైన్‌ను కూడా పక్క రాష్ట్రం బుక్‌ చేసుకునేదని వివరించారు. బాధ్యల లేకుండా, రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయ లేని కొంత మంది నాకు సమైక్యవాదుల ఏజెంట్లుగా ఉన్నవారు అనవసర ఆరోపణలు చేశారన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి యూనిట్‌ కరెంటును రూ.3.90కి కొన్న సమయంలో సింహాద్రి నుంచి రూ.4.33కు కొన్నామని బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో దక్షిణాదిన ఎవరూ కూడా రూ.3.90 కంటే తక్కువగా ఎవరూ కొనలేదని అన్నారు. నవరత్నాల్లో ఒకటైన బీహెచ్‌ఈఎల్‌కు పనులు అప్పగించామన్నారు. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీపై చర్చ అర్థరహితమని అన్నారు. 48 నెలల్లోనే కొత్తగూడెం ప్లాంటు నిర్మాణం పూర్తి చేయడం దేశంలోనే రికార్డు, అదే ఆర్టీపీపీ ఎప్పుడో చేపట్టినా మొన్న పూర్తి చేశారని వివరించారు.

"ఈర్ష్య, కుట్రబుద్ధితో కొందరు కేసీఆర్‌ను బద్నాం చేయాలని అర్థ రహిత ఆరోపణలు చేశారు. యాదాద్రి విషయంలో ఆరోపణలు వేస్ట్‌, అన్ని అనుకూలంగా ఉన్నందునే దామరచర్ల ఎంపిక చేశారు. కేంద్రం బొగ్గు ఎక్కడి నుంచైనా కేటాయించవచ్చు. పది శాతం విదేశీ బొగ్గు వాడాలని కేంద్రం ఇప్పటికే షరతు పెట్టింది. కృష్ణా తీరంలో వెనకబడిన నల్గొండ జిల్లాలో పెట్టాలని తాను అప్పుడు సీఎం కేసీఆర్‌ను కోరాను. దుర్మార్గమైన, ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ కూడా బీహెచ్‌ఈఎల్‌కు నామినేషన్‌ పద్ధతిన ఇచ్చారు. తెలంగాణ కంటే రూ.1150 కోట్లు ఎక్కువగా ఏపీ ఇచ్చింది. తెలంగాణ కంటే తక్కువ ధరకు ఎవరైనా ఇచ్చారా" అంటూ బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు.

"తెలంగాణను కాపాడుకోవడం కొరకు, అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్‌నే ముఖ్యం. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందం రూ.3.90 పైసలు యూనిట్‌కు పడిందో ఈ డబ్బుతో దేశంలో ఎక్కడా కూడా తక్కువకు విద్యుత్‌ దొరకలేదు. విద్యుత్‌ కొనుగోళ్లలో కేసీఆర్‌ను ఒక్కరినే బాధ్యులు చేయడం సరికాదు. ఆనాడు ఎవరైతే ఉన్నారో వారందరినీ విచారించాలి."- జగదీశ్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

పాలన చేతకాక అప్పులు, అప్పులు అంటూ పాడిందే పాడుతున్నారు : జగదీశ్‌ రెడ్డి

2014 నాటికి డిస్కంల అప్పు రూ.44 వేల కోట్లు : జగదీశ్‌రెడ్డి

Last Updated : Jun 29, 2024, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details