AP Ex Minister Peddireddy Land Scam : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 29న పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ‘ఈనాడు’ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. దానిపై అప్పట్లో విలేకరుల సమావేశం నిర్వహించిన పెద్దిరెడ్డి, ఆ భూములన్నీ తాను కాయకష్టం చేసి, చెమటోడ్చి సంపాదించుకున్నవి అన్నట్లుగా అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు, పెద్దిరెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని నిగ్గుతేల్చారు.
295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాల పట్టా భూమి మాత్రమే ఉంటే, అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని, దాని చుట్టూ కంచె వేశారని విజిలెన్స్ బయటపెట్టింది. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట వెబ్ల్యాండ్లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్లు తెలిపారు. రాజకీయ పలుకుబడి, అధికార దుర్వినియోగంతో అటవీ భూములను కబ్జా చేసి పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్లు తేల్చింది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది.
పెద్దిరెడ్డి అక్రమణలపై విజిలెన్స్ విభాగం బయటపెట్టిన ఏడు ఆధారాలు :
1. ఫెయిర్ అడంగల్ ప్రకారం
- మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని 295, 296 సర్వే నంబర్లలో తమకు 75.74 ఎకరాల భూమి ఉందని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ 1905 నుంచి 1920 సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం ఈ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 295లో 17.69 ఎకరాలు, 296లో 6 ఎకరాలు కలిపి మొత్తం 23.69 ఎకరాలు మాత్రమే పట్టా భూమి ఉంది. అదీ మెట్ట భూమి.
![AP Ex Minister Peddireddy Land Scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23517953_a.jpg)
2. పాకాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోని రిజిస్టర్డ్ సేల్డీడ్లు
- 295, 296 సర్వే నంబర్లలో ఉన్నది 23.69 ఎకరాలైతే పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 45.80 ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నట్టు రిజిస్టర్డ్ సేల్ డీడ్లు ఉన్నాయి. ఆ రెండు సర్వే నంబర్లను సబ్డివిజన్ చేసినట్టుగా చూపించి ఎక్కువ భూమి రిజిస్టర్ చేసుకున్నారు.
- దేశిరెడ్డి మంగమ్మ నుంచి పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి సర్వే నంబర్ 295/1ఏలో 15 ఎకరాలు కొన్నట్టు 2000 డిసెంబరు 29న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
- దేశిరెడ్డి శ్రీరాములురెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 295/1బీలో 10.80 ఎకరాలు కొన్నట్టు 2009 డిసెబరు 29న రిజిస్ట్రేషన్ చేశారు.
- దేశిరెడ్డి చెంగారెడ్డి నుంచి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి 295/1సీలో 10 ఎకరాలు కొన్నట్టు 2001 జనవరి 1న రిజిస్ట్రేషన్ చేశారు.
- దేశిరెడ్డి సర్వేశ్వరరెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 295/1డీలో 0.89 ఎకరాలు కొన్నట్టు 2001 జనవరి 1న సేల్డీడ్ జారీ అయ్యింది.
- సర్వే నంబర్ 295లో 17.69 ఎకరాల భూమి ఉంటే ఏకంగా 36.69 ఎకరాల్ని పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకులు వేరే వ్యక్తుల నుంచి కొన్నట్లు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఆ సర్వే నంబరులో ఉన్నదాని కంటే అదనంగా 19 ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగింది.
- సర్వే నంబర్ 296లో ఉన్నదే ఆరు ఎకరాలైతే, దేశిరెడ్డి సర్వేశ్వరరెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 296/1లో 9.11 ఎకరాలు కొన్నట్లు 2001 జనవరి 1న రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడున్న దానికంటే అదనంగా 3.11 ఎకరాల్ని రిజిస్టర్ చేయించుకున్నారు.
![AP Ex Minister Peddireddy Land Scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23517953_i.jpg)
3. రెవెన్యూ శాఖ వెబ్ల్యాండ్ పోర్టల్
- 295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాలుంటే, ఏకంగా 45.80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకులు తమ రాజకీయ అధికారం, పలుకుబడితో అక్కడ 77.54 ఎకరాలున్నట్లు క్లెయిం చేసుకున్నారు.
- పెద్దిరెడ్డి పేరు పేరిట, కుటుంబ సభ్యుల పేరిట 77.54 ఎకరాలున్నట్టు నమోదు చేయించారు. ఉన్న దానికంటే 53.85 ఎకరాలు అదనంగా వారి పేరిట నమోదు చేయించుకుని, భూ ఆక్రమణలకు పాల్పడ్డారు.
![AP Ex Minister Peddireddy Land Scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23517953_h.jpg)
4. 10-1 అడంగల్
- దీని ప్రకారం 77.54 ఎకరాలు పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకుల ఆధీనంలో ఉన్నట్టు తేలింది. దానిలో 40.91 ఎకరాలు కొనుగోలు చేసినట్టు, మిగతా భూమి అనువంశికం, వారసత్వం, సొంతం అన్న కేటగిరీల్లో చూపించారు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం 45.80 ఎకరాలు కొన్నట్టుగా ఉంది. 10-1 అడంగల్కు వచ్చేసరికి 40.9 ఎకరాలు కొన్నట్టుగా ఉంది. మిగతా భూమి అనువంశికంగా వచ్చినట్లు చెప్పారు.
![AP Ex Minister Peddireddy Land Scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23517953_g.jpg)
5. మంగళంపేట రెవెన్యూ గ్రామపటం ప్రకారం
- 295, 296 సర్వే నంబర్లలోని భూమి మంగళంపేట గ్రామానికి ఆగ్నేయంలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో రక్షిత అటవీ ప్రాంతంలో ఉంది. ఆ రెండు సర్వే నంబర్లలోని భూమి వేర్వేరు చోట్ల ఉంది. చుట్టూ రక్షిత అటవీ ప్రాంతం, మధ్యలో ఆ భూములున్నాయి.
![AP Ex Minister Peddireddy Land Scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23517953_f.jpg)
6. గూగుల్ ఎర్త్ మ్యాప్లు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటన
- గూగుల్ ఎర్త్ మ్యాప్లు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలో 295, 296 సర్వే నంబర్లలో 23.65 ఎకరాలుంటే, పెద్దిరెడ్డి మొత్తం 104 ఎకరాలకు ఇనుప కంచె వేశారు. అటవీ అధికారులు, పంచాయతీ సర్వేయర్తో కలిసి ఆ ప్రాంతాన్ని విజిలెన్స్ బృందం పరిశీలించింది. గూగుల్ ఎర్త్ మ్యాప్లోని కోఆర్డినేట్స్ ద్వారా చూస్తే అది మొత్తం 104 ఎకరాలున్నట్టు తేలింది.
- 10-1 అడంగల్ ప్రకారం 86.65 ఎకరాలున్నట్లు చూపించారు. అంటే ఆ సర్వే నంబర్లలో రికార్డుల ప్రకారం ఉన్న భూమి 23.69 ఎకరాలే. 10-1 అడంగల్లో అదనంగా 62.96 ఎకరాలు క్లెయిమ్ చేస్తున్నారు.
- ఫెయిర్ అడంగల్ ప్రకారం రెండు సర్వే నంబర్లలో మొత్తం భూమి విస్తీర్ణం 23.69 ఎకరాలు మాత్రమే. కానీ కొనుగోలు దస్తావేజుల ప్రకారం 45.80 ఎకరాలుగా చేశారు. 10-1 అడంగల్ లెక్కల్లో 86.65 ఎకరాలుగా ఉంది. కంచె వేసిన మొత్తం భూమి 104 ఎకరాలు. అంటే సర్వే నంబర్లలోని మొత్తం భూమితో పోలిస్తే 86.65 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారు.
- అక్కడికి వెళ్లి చూస్తే ఎవరి కంటికైనా ఆక్రమణలు స్పష్టంగా కన్పిస్తాయని ప్రభుత్వ, అటవీ భూముల్ని కాపాడాల్సిన రెవెన్యూ, అటవీ శాఖల అధికారులకూ ఇవి తెలుసని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది.
![AP Ex Minister Peddireddy Land Scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23517953_e.jpg)
![AP Ex Minister Peddireddy Land Scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23517953_d.jpg)
7. గ్రామ పంచాయతీపై ఒత్తిడి తెచ్చి
- అటవీ భూమిలో పెద్దిరెడ్డి తారురోడ్డు వేయించారని 2022 ఆగస్టు 18న జారీ చేసిన గెజిట్ 1195 పరిశీలిస్తే ఇది అర్థమవుతుందని విజిలెన్స్ నివేదికలో ప్రస్తావించింది.
- మంగళంపేట- కొత్తపేట సమీపంలోని గంగమ్మగుడి నుంచి ఎలుకదూనిపెంట ఎస్టీకాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర శాశ్వత రహదారి నిర్మించాలంటూ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నన్నువారిపల్లె పంచాయతీలో పెద్దిరెడ్డి తీర్మానం చేయించారని దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధులతో ప్రైవేటు భూమిలో తారు రోడ్డు నిర్మించారని స్పష్టం చేసింది.
![AP Ex Minister Peddireddy Land Scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/23517953_c.jpg)
పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : అటవీ, రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నేరపూరిత విశ్వాస ఘాతుకం కింద జీవిత ఖైదు లేదా పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలని సూచించింది. అంతేకాకుండా పలు సెక్షన్లను సూచించింది. రెవెన్యూ, అటవీ అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎంత మొత్తంలో రెవెన్యూ, అటవీ భూములు ఆక్రమించుకున్నారో నిగ్గు తేల్చాలని నివేదికలో సూచించింది. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తున్నా, చూస్తూ ఊరుకున్న రెవెన్యూ, అటవీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కబ్జాకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ - తిరుపతి ప్రజలకు తొలగని రహదారి సమస్య - Peddireddy Land Issues in Tirupati
రోడ్డుపై పెద్దిరెడ్డి పెత్తనం - ప్రజలు తిరగకుండా గేట్లు - ap ex mini Peddireddy Occupied Road