JEE Main 2025 Results : దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్) ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం (ఫిబ్రవరి 10న) మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో రిజల్ట్ను విడుదల చేశారు.
జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ విడుదలైన ఫలితాలలో దేశవ్యాప్తంగా బాలికల కేటరిగిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ సత్తా చాటింది. 100 పర్సంటైల్ సాధించిన ఏకైక బాలికగా సాయి మనోజ్ఞ నిలిచింది. దేశం మొత్తంలో 14 మందికి వంద పర్సంటైల్ రాగా వారిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తి కొండ, తెలంగాణ నుంచి బని బ్రాత మాజీ 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు.
జేఈఈ మెయిన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఐదుగురికి 100 పర్సంటైల్ : రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఐదుగురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి రికార్డు సృష్టించారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో ఏపీకి చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99 పర్సంటైల్ సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. పరీక్షా సమయంలో అక్రమాలకు పాల్పడిన 39 మంది ఫలితాలను మాత్రం ప్రకటించలేదని ఎన్టీఏ పేర్కొంది. జనవరి 22 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ మెయిన్ మొదటి సెషన్ కి 13.11లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 12.58 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.
ప్రముఖ విద్యాసంస్థలైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకొనేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.
ఉత్తమ స్కోరుతో ర్యాంకులు : ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో ఫేజ్ పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు అధికారులు ర్యాంకులు కేటాయిస్తారు.
ఆ తర్వాత కేటగిరీల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సెలింగ్ ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి.
జేఈఈ పరీక్ష రాస్తున్నారా? - ఐతే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల - అప్పటి వరకు అభ్యంతరాల స్వీకరణ