తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 9:57 AM IST

ETV Bharat / opinion

టార్గెట్‌ 400- NDA త్రిశూల వ్యూహం- వీటిపైనే ఫోకస్​!

NDA Target 400 In Lok Sabha : రాజకీయవేడిని రగిలిస్తున్న 18వ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి పగ్గాలను చేపట్టేందుకు మరింత బలంగా రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే జాతీయ ప్రజాస్వామ్య కూటమి- ఎన్​డీఏకు 400 సీట్లను కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క బీజేపీనే 370 స్థానాలు గెలుస్తుందని ధీమాతో ఉన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికై నెహ్రూ రికార్డును సమం చేయడం ఖాయమని ప్రీపోల్స్​ సర్వేలు అంచనాలు వేస్తున్నా 400 స్థానాల లక్ష్యం సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకున్నారు. గెలిచే సీట్లపై అంత ధీమాగా ఎలా ఉన్నారో ఈ కథనంలో చూద్దాం.

NDA Target 400 Analysis Story
NDA Target 400 Analysis Story

NDA Target 400 In Lok Sabha :ఎన్నికలంటేనే ఎన్నో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. ప్రజల నాడిని పట్టడం తలపండిన రాజకీయ నాయకులకు కూడా అంత తేలిక ఏమీ కాదు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఈవీఎంలో మీటను నొక్కే వరకు ఏ క్షణంలో మనసు మార్చుకుంటారో చెప్పలేం. అయినప్పటికీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు కైవసం చేసుకోవాలని ఎన్​డీఏ పట్టుదలగా ఉంది. 'అబ్‌ కీ బార్‌ చార్‌సౌ పార్‌' అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తాను పాల్గొన్న ప్రతి సభలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన బాటలోనే బీజేపీ నాయకులు ప్రయాణిస్తున్నారు.

కాంగ్రెస్​ పార్టీ@414 సీట్లు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఒక రాజకీయ కూటమి 400 స్థానాలు గెలుచుకోవడం ఆషామాషీ కాదు. బీజేపీ ఒక్కటే సొంతంగా 370కిపైగా సీట్లు సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఏకంగా 414 సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది. ఈసారి ఎన్​డీఏ ఆ స్థాయిలో సీట్లతో అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇంత భారీ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్​డీఏ త్రిశూల వ్యూహాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్​డీఏ హయాంలోనే అయోధ్య నిర్మాణం
ఎన్​డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యంత సానుకూల వాతావరణం ఉంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆ పార్టీ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుని ఊపుమీద ఉంది. భక్తుల శతాబ్దాల కల అయిన అయోధ్యలో శ్రీరాముని భవ్యమందిర నిర్మాణం ఎన్​డీఏ సర్కార్‌ హయాంలోనే సాకారమైంది. మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలోనూ అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఈ చర్యలు అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిసి వచ్చే అవకాశముంది.

వాటిని చూసి ఓటెయ్యండి : ఎన్​డీఏ
ఎన్​డీఏ కూటమికి ప్రధాన బలం ప్రధాని మోదీనే. ప్రపంచ దేశాల్లో భారత్‌కు పెరిగిన ప్రాధాన్యం మోదీ వల్లేనని అనే మాట ఇప్పటికీ గట్టిగా వినిపిస్తోంది. మౌలిక వసతుల కల్పనకు మోదీ సర్కార్‌ అనేక చర్యలు తీసుకుంది. ఎన్​డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో అనేక ఎక్స్‌ప్రెస్‌ వేలు నిర్మితమయ్యాయి. వందే భారత్ రైళ్లు వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్​డీఏకు ఎన్నికల్లో కలిసి వచ్చే అంశమే. అందుకే గత పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఎన్​డీఏ కోరుతోంది. వికసిత్ భారత్‌ అనే నినాదాన్ని ప్రచారస్త్రంగా ఎంచుకుంది.

ఆ రాష్ట్రాల్లో ఎవరి దారి వారిదే
మోదీకి దీటైన నాయకుడు ప్రతిపక్ష కూటమి ఇండియాలో లేకపోవడం ఎన్​డీఏకు కలిసి వస్తోంది. పాతమిత్రులతో బలోపేతమైన ఎన్​డీఏకు దీటుగా ఇండియా కూటమి లేదనే వాదన వినిపిస్తోంది. ఎన్​డీఏను ప్రధాని మోదీ ముందుండి నడిపిస్తుంటే ఇండియా కూటమిని అలా నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న తరచూ తలెత్తుతోంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందులు పడడం కూడా ప్రతిపక్ష కూటమికి ఇబ్బందిగా మారింది. కూటమి పేరుతో జట్టుకట్టిన ప్రతిపక్షాలు పంజాబ్, బంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఎవరికివారే పోటీచేస్తామని ప్రకటించడం వల్ల ఆయా పార్టీల మధ్య ఓట్లు చీలి చివరకు ఎన్​డీఏకే లాభాన్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవస్థాగతంగా బలంగా ఉండడం, క్షేత్రస్థాయిలో బలమైన నెట్‌వర్క్‌, ప్రజల నుంచి అభిప్రాయాల స్వీకరణ, తప్పులను వేగంగా సరిదిద్దే చొరవ ఎన్​డీఏకు నేతృత్వం వహిస్తున్న బీజేపీకి పెట్టని కోటగా మారాయి.

ఆ ధీమాతోనే బీజేపీకి 370 సీట్లు?
బీజేపీ తరహాలో సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసుకుని ఎన్నికలకు వెళ్లడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలం కావడం కాషాయ దళానికి మరో ఆయుధంగా మారింది. ఫలితంగా ప్రతికూల అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థులపై పైచేయి సాధించే కళను బీజేపీ అలవరుచుకుంది. ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌, సీఏఏ అమలు లాంటి తన రాజకీయపరమైన ఎజెండాలు, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఇంటింటికీ కొళాయి నీరు, ప్రత్యక్ష నగదు బదిలీ విధానం లాంటి సంక్షేమ పథకాలతో తన పట్టును నిలుపుకొనే ప్రయత్నం చేస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు వరకు ప్రతి ఎన్నికనూ బాధ్యతగా తీసుకొని గెలుపే లక్ష్యంగా పని చేస్తోంది. దాని ఫలితంగానే హిందీ ప్రభావిత ప్రాంతాల్లో గరిష్ఠ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునే స్థాయికి ఎదిగింది. ఆ ధీమాతోనే ఒక్క బీజేపీనే 370 సీట్లను సాధిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

దక్షిణాదిలో మోదీ సుడిగాలి పర్యటనలు
దేశవ్యాప్తంగా ఎన్​డీఏకు మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశమున్నప్పటికీ ఇండియా కూటమిలోని పక్షాలను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. ఉత్తర్​ప్రదేశ్‌లో అఖిలేష్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఎన్​డీఏకు గట్టి పోటీనిచ్చే అవకాశముంది. బిహార్‌లో ఆర్​జేడీ సైతం బలంగానే ఉంది. బంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో పోటీ ఆషామాషీ కాదు. ఎన్​డీఏకు 400 సీట్ల లక్ష్యానికి ప్రధాన అడ్డంకి దక్షిణాది రాష్ట్రాలే కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్​డీఏకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత సానుకూల వాతావరణం బీజేపీ, దాని మిత్రపక్షాలకు దక్షిణ భారతంలో లేవనే వాదన ఉంది. అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై మరింత దృష్టి పెట్టిన ప్రధాని మోదీ విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. సుడిగాలి పర్యటనలతో బీజేపీ, మిత్రపక్షాల శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

ఎలక్టోరల్​ బాండ్ల ప్రభావం
ఎలక్టోరల్​ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు ఎన్​డీఏ సర్కార్‌కు ఎన్నికల్లో కొంత ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు ఉంటాయనే వాదనా వినిపిస్తోంది. అయితే సంక్షేమం, అభివృద్ధి అంజెండాలతో పోల్చితే పార్టీలకు విరాళాల అంశం ప్రభావం చూపేది తక్కువనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వారణాసి టు వయనాడ్​​- రసవత్తర పోరుకు అంతా రె'ఢీ'- లోక్‌సభ హాట్​ సీట్లు ఇవే!

కర్ణాటకపై BJP స్పెషల్ ఫోకస్​- మైసూర్​ యువరాజుకు టికెట్- 2019 సీన్​ రిపీట్​కు పక్కా ప్లాన్!

ABOUT THE AUTHOR

...view details