Prathidwani :ప్రతిచేతికి పని కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకటే రోజు 6 కీలక విధానాలు ప్రకటించి ఆశ్చర్య పరిచింది. అయిదేళ్లుగా పడావుబడ్డ పారిశ్రామికరంగానికి కొత్త ఊపిరి ఇవ్వడం , అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పారిశ్రామికాభివృద్ధి, ఎంఎస్ఎంఈలు, ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్, ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్లు, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీలు విధానాలు గేమ్ ఛేంజర్లు కానున్నాయి. మరి దీనిపై పారిశ్రామికవర్గాలు ఎలా స్పందిస్తున్నాయి? గడిచిన అయిదేళ్లు జరిగిన నష్టమేంటి? రానున్న అయిదేళ్లు, ఆ తర్వాతి భవిష్యత్ ముఖచిత్రమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ నరేష్ కుమార్, ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా అనంతపురంలో ఆటోమోటివ్, కడప, కర్నూలులో పునరుద్పాదక ఇంధనం, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరిలో ఆక్వా, పెట్రోకెమికల్స్, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, రక్షణ రంగాలపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని మంత్రి లోకేశ్ అన్నారు. ఆయా ప్రాంతాల్లోని ఐటీఐ , పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధిత రంగాల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు. విదేశాల్లో బ్లూకాలర్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉందన్న లోకేశ్ ఒక్క జపాన్లోనే 50 వేల మంది బ్లూకాలర్, నర్సింగ్ ఉద్యోగులు కావాల్సి ఉందన్నారు.