తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ హత్యలో భారత్​ పాత్ర - అదే విషయాన్ని అమెరికాకు చెప్పా' - జస్టిన్ ట్రూడో కవ్వింపు మాటలు

జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఇండియా - గమ్మునున్న అమెరికా

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Justin Trudeau
Justin Trudeau (AP)

India Canada Tensions :ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించిన సమాచారాన్ని తమ మిత్ర దేశాలతో పంచుకున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. ముఖ్యంగా తమకు అత్యంత సన్నిహత దేశమైన అమెరికాకు తమ వద్దనున్న పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఓట్ల కోసం అగచాట్లు
తమ దేశంలోని సిక్కు ఓటర్లను ఆకట్టుకునేందుకు కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో నానా అవస్థలు పడుతున్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్​దీప్​సింగ్ నిజ్జర్​ హత్యను భారత్​పైకి తోసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల పాత్ర ఉందంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ట్రూడో చర్యలపై భారత్ మండిపడింది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను అక్టోబర్​ 19 అర్థరాత్రి 12 గంటల్లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. అంతేకాదు కెనడాలోని భారత దౌత్యాధికారులను ఇండియాకు తిరిగి వచ్చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జస్టిన్ ట్రూడో హడావిడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

"గతేడాది మా కెనడా పౌరుడి (ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ ) హత్య జరిగింది. భారత్​ అధికారులు చట్టవిరుద్ధమైన రీతిలో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మిత్రదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో పంచుకున్నాం. మేము చట్టబద్ధమైన పాలనకు కట్టుబడి ఉన్నాం. అందుకే మా మిత్ర పక్షాలతో కలిసి పని చేస్తూనే ఉంటాం" అని జస్టిన్ ట్రూడో తెలిపారు.

స్పందించని అమెరికా
జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలతో భారత్​, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దిగజారాయి. అయినప్పటికీ ఈ దౌత్య సంక్షోభం గురించి యూఎస్​ స్టేట్ డిపార్ట్​మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఉగ్రవాదులకు ట్రూడో సర్కార్ మద్దతు
'భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదం, హింస, వేర్పాటువాదానికి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని, దీనికి ప్రతిస్పందనగా తగు చర్యలు తీసుకునే హక్కు ఇండియాకు ఉందని' భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఓ) స్పష్టం చేసింది. ట్రూడో వ్యాఖ్యలు చాలా కాలంగా భారతదేశంపై, ఆయన అనుసరిస్తున్న శత్రుత్వ వైఖరికి రుజువుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

'2018లో సిక్కు ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ట్రూడో భారత్​ పర్యటనకు వచ్చారు. తరువాత తన మంత్రివర్గంలో భారతదేశానికి సంబంధించి తీవ్రవాద, వేర్పాటువాద ఎజెండాతో ప్రత్యక్ష సంబంధం కలిగిన వ్యక్తులను చేర్చుకున్నారు. చివరికి 2020 డిసెంబర్​లో భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా ఆయన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తోంది' అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.

'ఆ రోజు రాత్రి 12గంటల్లోపు భారత్‌ విడిచి వెళ్లిపోండి!'- కెనడా దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు

ట్రూడో చర్యలపై మండిపడ్డ భారత్‌- కెనడా దౌత్యవేత్తకు సమన్లు

ABOUT THE AUTHOR

...view details