Indian Navy rescue : సముద్రపు దొంగల బారి నుంచి 19 మంది పాకిస్థాన్కు చెందిన నావికులను కాపాడింది భారత నౌకాదళం. సోమాలియా తూర్పు తీరంలో సోమవారం చేపల వేటకు వెళ్లిన అల్ నయీమి నౌకను 11 మంది సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. ఆ సమయంలో నౌకలో 19 మంది పాకిస్థానీ సిబ్బందిని ఉన్నారు. తమను రక్షించమని భారత నావికాదళానికి అత్యవసర సందేశం రావటం వల్ల యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రను మరోసారి రంగంలోకి దించింది. కొచ్చి తీరానికి 800 మైళ్ల దూరంలో ఉన్న ఘటనాస్థలికి చేరుకుని సాయుధ సముద్రపు దొంగల నుంచి అల్ నయీమి నౌకను కాపాడింది.
ఇరాన్ జెండాతో వెళ్తున్న అల్ నయీమి బోటులోని సిబ్బందిని సురక్షితంగా రక్షించేందుకు భారత నావికాదళానికి చెందిన మెరైన్ కమాండోలు రంగంలోకి దిగారు. యుద్ధ హెలికాప్టర్ల ద్వారా నౌకలోకి ప్రవేశించి సొమాలియా సముద్రపు దొంగల చెరలో ఉన్న 19 మంది బందీలను విడిపించారు. 36 గంటల్లో భారత నావికాదళం చేపట్టిన రెండో విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్ ఇది. నౌకలకు భద్రతను కల్పించేందుకు భారత నౌకాదళం యుద్ధనౌకలను హిందూ మహాసముద్రంలో మోహరించింది.