Bangladesh Fire Accident : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 45మంది మృతిచెందారు. 22మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ఏడంతస్తుల రెస్టారెంట్లో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరినట్లు సమాచారం. ఈ మేరకు బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సమంత లాల్ సేన్ వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థతి విషమంగా ఉందని ఆయన తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న 70 మందిని రక్షించారు. వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ సమంత లాల్ సేన్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఢాకా బెయిలీ రోడ్డులో ఉన్న ఓ బిర్యానీ రెస్టారెంట్లో గురువారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగం అధికారి మహమ్మద్ షిహబ్ వెల్లడించారు. మంటలు క్రమంగా పై అంతస్తులకు విస్తరించినట్లు తెలిపారు. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయి.