Vitiligo Causes and Symptoms:మనం అందంగా కనిపించేలా, చూడగానే ఆకట్టుకునేలా చేసేది చర్మమే. అయితే కొద్దిమంది చర్మం మీద బొల్లి మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. నిజానికి ఇందులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. మచ్చల మీద దురద, మంట వంటి బాధలేవీ తలెత్తవు. కానీ.. అందవిహీనంగా ఉంటాయనే భావనతో.. బాధపడుతుంటారు. అసలు ఈ బొల్లి ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? దీనికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బొల్లి మచ్చలకు కారణాలు:ఆధునిక వైద్య రంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటి వరకూ బొల్లి మచ్చలు రావడానికి గల స్పష్టమైన కారణాలను వైద్యులు ఇప్పటికీ కనుగొనలేకపోయారు. ఇది ఎందుకొస్తుందనేందుకు స్పష్టమైన కారణాలు లేకపోయినా.. పలు అంశాలు ఈ సమస్యకు కారణమవుతాయని అంటున్నారు నిపుణులు. అవేంటంటే..
రోగనిరోధక వ్యవస్థపై దాడి:మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం వల్ల (ఆటోఇమ్యూన్) బొల్లి మచ్చలు వస్తున్నట్టు హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో చర్మ, సుఖవ్యాధుల విభాగం హెడ్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ జి.నరసింహారావు నేత అంటున్నారు. చర్మం పై పొరలో మెలనోసైట్ కణాలుంటాయి. ఇవి మెలనిన్ అనే వర్ణ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా చర్మానికి రంగును తెచ్చిపెడతాయి. వీటి మీద రోగనిరోధక వ్యవస్థ పొరపాటున దాడి చేసినప్పుడు అవి నాశనమవుతాయి. దీంతో రంగు ఉత్పత్తి తగ్గిపోయి, చర్మం పాలి పోయినట్టు అవుతుంది. అక్కడ తెల్లగా, లేత గులాబి రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీన్నే బొల్లి (విటిలిగో) అని పిలుస్తారు.
జన్యుపరమైన కారణాలు:వంశపారంపర్యంగా కూడా బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఒత్తిడి:తీవ్రమైన ఒత్తిడి బొల్లి మచ్చలు ఏర్పడడానికి లేదా దానిని మరింత తీవ్రతరం చేయడానికి కారణమవుతుందని చెబుతున్నారు.
రసాయనాలకు గురికావడం:కొన్ని ఇన్ఫెక్షన్లు, గాయాలు లేదా రసాయనాలకు గురికావడం వంటి ఇతర కారణాలు కూడా బొల్లికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.
సూర్యరశ్మికి గురికావడం:సూర్యరశ్మికి గురికావడం వల్ల కూడా బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అతినీలలోహిత (UV) కిరణాలు మెలనోసైట్ కణాలను దెబ్బతీస్తాయని.. దీని వల్ల విటిలిగో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 2004లో పిడియాట్రిక్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. సూర్యరశ్మికి ఎక్కువగా గురయ్యే పిల్లలలో బొల్లి మచ్చలు ఏర్పడే అవకాశం 2 రెట్లు ఎక్కువని కనుగొన్నారు. తల, మెడ ప్రాంతాలలో సూర్యరశ్మికి గురయ్యే పిల్లలలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు నివేదించారు. ఈ పరిశోధనలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు, బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్గరెట్ లీ పాల్గొన్నారు.