Asthma Risk Factors In Children :ఔషధ చికిత్సలో యాంటీ బయాటిక్స్ శక్తిమంతమైన అస్త్రాలుగా ఉపయోగపడుతాయి. చిన్నారులకు వీటిని అవసరం లేకున్నా వినియోగిస్తే... 'ఉబ్బసం (ఆస్తమా)' బారినపడతారని వైద్యనిపుణలు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో ఎక్కువగా యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తే ఉబ్బసం ముప్పు ఎందుకు పెరుగుతుంది? దాని ప్రభావం భవిష్యత్ జీవితంపై ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలకు యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్లే కలిగే ఇబ్బందులపై ఆస్ట్రేలియాకు చెందిన 'మోనాష్ యూనివర్సిటీ' పరిశోధకులు ఎలుకలపై రీసెర్చ్ చేశారు. ఆ పరిశోధన వివరాలు తాజాగా 'టీబీసీ జర్నల్'లో ప్రచురితమైయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.60 కోట్ల మంది ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నారని, ఈ వ్యాధితో ఏటా 4.55 లక్షల మంది చనిపోతున్నారని టీబీసీ జర్నల్ తెలిపింది. ఈ నేపథ్యంలో పిల్లల్లో ఉబ్బసం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిలోఫర్ ఆసుపత్రి సీనియర్ పీడియాట్రీషియన్ ప్రొఫెసర్ తోట ఉషారాణి ఈటీవీ భారత్కు కీలక విషయాలు వెల్లడించారు.
యాంటీ బయాటిక్స్ ఎఫెక్ట్స్ :ఐదేళ్లలోపు పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లకు 90% కారణం వైరస్లే అని డాక్టర్ ఉషారాణి తెలిపారు. వీటి కారణంగా మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉండి, నాలుగైదు రోజులకు దానంతటదే తగ్గిపోతుందని వెల్లడించారు. కాకపోతే కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారని, అవగాహన లేని కొందరు వైద్యులు కూడా చిన్నారులకు యాంటీ బయాటిక్స్ను సూచిస్తుంటారని ఆమె పేర్కొన్నారు. ఇలా వాడితే వాటికి నిరోధకత ఏర్పడటం ద్వారా పిల్లలకు భవిష్యత్లో నిజంగా అవసరమైన సమయంలో యాంటీ బయాటిక్స్ పనిచేయవన్నారు. ఈ కారణంగానే ఒకప్పుడు టైఫాయిడ్కు బాగా పనిచేసిన సిప్రోఫ్లోక్సాసిన్ మందు ఇప్పుడు ప్రభావం చూపడం లేదని తెలిపారు.
12 ఏళ్లలోపు పిల్లల్లో 7.9% ముప్పు : పిల్లలకు చిన్న వయసులోనే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ కీలక దశలో తల్లిపాలు పట్టడంతోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిచాల్సి ఉంటుంది. తద్వారా పిల్లల ఎదుగుదలకు, రోగ నిరోధకశక్తి చక్కగా పనిచేయడానికి ఈ బ్యాక్టీరియా తొడ్పడుతుంది. అయితే, యాంటీబయాటిక్స్ అధికంగా వాడితే పేగుల్లోని మంచి బ్యాక్టీరియకు కూడా నష్టం జరుగుతుంది. రోగ నిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆస్తమా ముప్పు పెరుగుతుందని తెలుస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం... ఇండియాలో 12 ఏళ్లలోపు పిల్లల్లోని 7.9% మందిలో ఆస్తమా కనిపిస్తోందని వెల్లడైంది. పిల్లలు, పెద్దలు కలుపుకొని.. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా కారణంగా సంభవించే మరణాల్లో సుమారు 46% భారత్ నుంచే నమోదవుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. NLM కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. (National Librabry of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
పిల్లికూతలు-డొక్కల ఎగరవేత : ఆస్తమా ముందుగా దగ్గుతో వస్తుంది. పిల్లి కూతలు కనిపిస్తుంటాయి. పిల్లలు డొక్కలు ఎగరేస్తారు. ఆయాసం పెరుగుతుంటుంది. ఆహారం తీసుకోరు. పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటారు. ఉబ్బసం పెరిగితే ఆక్సిజన్ అందక.. జీవన్మరణ సమస్య కూడా ఎదురవుతుందని డాక్టర్ ఉషారాణి తెలిపారు.
తల్లి పాలే అత్యంత సురక్షితం :శిశువు పుట్టిన తొలి ఆర్నెల్లపాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని డాక్టర్ ఉషారాణి సూచిస్తున్నారు. ఆ తర్వాత రెండేళ్ల వరకు ఇతర ఆహారంతోపాటు తల్లి పాలను ఇస్తే ఆస్తమా బారినపడకుండా రక్షణ లభిస్తుందని ఆమె తెలిపారు. సీసా పాలతో పెరిగిన పిల్లలు, తక్కువ బరువుతో, నెలలు నిండకముందే పుట్టిన వారు, సిజేరియన్తో జన్మించిన పిల్లలకు ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు పలు పరిశోధనల్లో తెలిలింది. అందుకే వైద్యులు యాంటిబయాటిక్స్ రాస్తే వాటి వాడకంపై పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రశ్నించాలని ఆమె సూచిస్తున్నారు.