తెలంగాణ

telangana

రూ.4 వేల రెమ్యునరేషన్​ నుంచి రూ.600 కోట్ల వరకు! - Kalki 2898 AD Director Nag Ashwin

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 11:25 AM IST

Kalki 2898 AD Director Nag Ashwin : ఒకప్పుడు రూ.4 వేలు జీతం తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు రూ.600 కోట్ల బడ్జెట్​తో కల్కి సినిమా తెరకెక్కించే స్థాయికి ఎదిగారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన సినీ జర్నీ గురించి తెలుసుకుందాం.

source ETV Bharat
Kalki 2898 AD Director Nag Ashwin (source ETV Bharat)

Kalki 2898 AD Director Nag Ashwin :చూడటానికి బక్క శరీరం, కానీ అందులో ఉన్న మెదడులో అసాధారణమైన ప్రతిభ దాగి ఉంది. అది మరెవరిదో కాదు. దర్శకుడు నాగ్ అశ్విన్​ది. వాస్తవానికి ఆయన్ను చూస్తే ఈయన దర్శకుడా అని ఆశ్చర్యపోతారు. అంత సింప్లిసిటీగా ఉంటూ తన ప్రతిభతో మ్యాజిక్ చేస్తుంటారు. ఒకప్పుడు రూ.4 వేలు జీతం తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు రూ.600 కోట్ల బడ్జెట్​తో సినిమా తెరకెక్కించే స్థాయికి ఎదిగారు. మరో రోజు కల్కి 2898 ఏడీ విడుదల సందర్భంగా నాగ్ అశ్విన్​ జర్నీ గురించి తెలుసుకుందాం.

విద్యార్థి దశలోనే కథనాలు, వ్యాసాలు - నాగ్​ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. నాన్న జయరామ్‌రెడ్డి, అమ్మ జయంతి. ఇక నాగ్​ అశ్విన్‌ మితభాషి. కానీ పనుల్లో చురుగ్గా ఉంటారు. విలక్షణ హీరో రానా దగ్గుబాటి ఈయన క్లాస్‌మేట్‌. విద్యార్థి దశలోనే నాగ్ అశ్విన్ కథనాలు, వ్యాసాలు రాయడం ప్రారంభించారు. ఓ సారి తన స్కూల్​ ఆవరణలో చెట్లు నరికేస్తుంటే వాటిని ఫొటోలు తీసి ఇక్కడేం జరుగుతోంది? ప్రకృతిని నాశనం చేస్తున్నదెవరు? అనే వార్త రాసి ప్రత్యేకంగా నిలిచారు. విద్యార్థి దశలో టాప్‌ టెన్‌ ర్యాంకర్లలో ఒకరిగా ఉండేవారు. మణిపాల్‌ మల్టీమీడియా కోర్సులో చేరి వీడియో ఎడిటింగ్‌ నేర్చుకున్నారు. కానీ ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి దర్శకుడిగా ఎదిగారు.

తొలి జీతం రూ.4వేలు - గోదావరి షూటింగ్​ సమయంలో అసిస్టెంట్​ డైరెక్టర్​గా శేఖర్ కమ్ముల దగ్గర చేరుదామనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో మంచు మనోజ్‌ నేను మీకు తెలుసా? చిత్రానికి ఏడీగా పనిచేశారు. మొదటి సంపాదనగా రూ. 4 వేలు జీతం అందుకున్నారు. అనంతరం శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్‌, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రాలకు పనిచేశారు. లీడర్‌ మూవీ ట్రైలర్​ను శేఖరే కట్​ చేశారు.

మొదటి కథ అలా తెరపైకి - లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ తర్వాత ఫ్రెండ్స్​తో కలిసి ఓ యాడ్‌ తెరకెక్కించారు. ఆ తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ షార్ట్‌ఫిల్మ్‌ చూసిన నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చారు. అప్పుడే నాగ్ అశ్విన్​ ఎవడే సుబ్రమణ్యం స్క్రిప్టు పూర్తి చేసి కథ వినిపించారు. అలా నాని, విజయ్‌ దేవరకొండతో కలిసి అశ్విన్ తొలి సినిమా 2015లో తెరపైకి వచ్చింది. వాస్తవానికి నానికి ముందు ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టిని ఎంపిక చేశారంట.

రెండో సినిమాకు జాతీయ గుర్తింపు - రెండో ప్రయత్నంలోనే సాహసం చేసి మహానటిని తెరకెక్కించారు. కీర్తి సురేశ్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించింది. వీలైనంత వరకూ ఆమె గౌరవం దెబ్బతినకుండా తీసి ప్రశంసలను అందుకున్నారు నాగ్ అశ్విన్​. అలా నాగ్ అశ్విన్ పేరు మార్మోగింది. అనంతరం తన మూడో చిత్రమైన కల్కి కథ రాసేందుకు 5 ఏళ్ల సమయం తీసుకున్నారు. సైన్స్‌కు మైథాలజీ జోడించి ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్​తో తీశారు. ప్రభాస్‌, అమితాబ్​, కమల్​ లాంటి స్టార్ హీరోలను ఒక తెరపై చూపించారు. ఈ చిత్రం మరో రోజులో విడుదల కానుంది. ఎవడే సుబ్రమణ్యం, మహానటిలో అతిథి పాత్రలు ఉన్నట్టే కల్కిలోనూ చాలానే గెస్ట్ రోల్స్ ఉన్నాయి. ఇక మూడు సినిమా తెరకెక్కించే జర్నీలోనే ఆంథాలజీ మూవీ పిట్ట కథలులోని ఓ ఎపిసోడ్​కు దర్శకత్వం కూడా వహించారు.

అతిథి పాత్రలు, అవార్డులు - ఇకఈ సినీ జర్నీలోనే స్నేహితులైన అశ్విన్‌- ప్రియాంక పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు. జాతి రత్నాలు సినిమా కోసం నిర్మాతగా మారారు నాగ్ అశ్విన్. మొదటి చిత్రంతో రాష్ట్ర (నంది) అవార్డు, రెండో చిత్రంతో నేషనల్‌ అవార్డు దక్కించుకున్న నాగ్‌ అశ్విన్‌, మూడో చిత్రం కల్కితో ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం - SS Rajamouli Oscar Academy

దీపిక ఫేవరెట్​ తెలుగు హీరో ఎవరో తెలుసా? - ప్రభాస్ మాత్రం కాదు! - Kalki 2898 AD Deepika Padukone

ABOUT THE AUTHOR

...view details